చర్చలకు రాకుండా కోర్టుకు కెక్తుతారు: ఎపి వైఖరిపై ప్రభాకర్ రావు మండిపాటు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు యాజమాన్యం వ్యవహారశైలి వల్లనే విద్యుతు వివాదాలు పరిష్కారం కావడం లేదని తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని ప్రతిపాదించినా స్పందించకుండా చీటికి మాటికి కోర్టుకెక్కుతున్నదని విమర్శించారు. తాజాగా ఎస్ఎల్పీకోసం ఏపీ సుప్రీకోర్టును ఆశ్రయించటాన్ని ఆయన ఉదహరించారు.
ఏపీ వైఖరి వల్ల ఉద్యోగుల విభజన, విద్యుత్ వినియోగంలో వాటా, ప్రాజెక్టుల కేటాయింపు వంటి అంశాల్లో పీటముడి పడిందన్నారు. తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్ఈఈఏ) ఆధ్వర్యంలో గురువారం విద్యుత్సౌధ ప్రాంగణంలో నిర్వహించిన అలయ్- బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి పదోన్నతులు కల్పించామని తెలిపారు. విద్యుత్ శాఖలో ప్రతి ఉద్యోగికి సర్వీసు కాలంలో కనీసం ఒక పదోన్నతి వచ్చేలా చూస్తామన్నారు. త్వరలో 1426 ఏఈ పోస్టులను భర్తీ చేస్తున్నామని, ఇందులో ఒక్కో కార్పొరేషన్ పరిధిలో 3వేల నుంచి 4వేల పోస్టులు కేటాయిస్తామని తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య సహా అన్ని సమస్యలను సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుందామని చెప్పారు. 2016 మార్చి నాటికి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ను అందించేందుకు ముమ్మర కృషి జరుపుతున్నామని అన్నారు.
విభజనకు ముందు సీమాంధ్ర అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టేవారని, ఆనాడు తెలంగాణ నినాదం కూడా ఇవ్వలేని స్థితి ఉండేదని టీఎస్ఈఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ శివాజీ అన్నారు. వీటన్నింటినీ అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉద్యమంలో కీలకంగా పనిచేశామన్నారు.