కాసేపు సూర్యుడికి రెస్ట్, చిరుజల్లులు: తల్లడిల్లిన జనాలకు ఊరట
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి ఒక్కరోజులోనే తెలంగాణలో 50 మంది, ఏపీలో 29 మంది మృత్యువాత పడ్డారు. పదేళ్లలో ఏప్రిల్ నెలలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఎండల వేడికి జనాలు తల్లడిల్లుతున్నారు.
అయితే, ఆదివారం నాడు ఒక్కసారిగా హైదరాబాదులో చిరు జల్లులు కురిశాయి. సూర్యూడు కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. ఎండల వేడికి తట్టుకోలేకపోతుండగా.. చిరుజల్లులు కొంత ఊరట కలిగించాయి.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. బోడుప్పల్, దిల్సుఖ్ నగర్, అంబర్ పేట, నాంపల్లి, కాప్రా, గోషా మహల్, ఘటకేసర్ తదితర పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. వేసవి తాపానికి అల్లాడుతున్న జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఎండ తీవ్రత ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉంది. అనంతపురం, రామగుండం, నిజామాబాదులలో 45 డిగ్రీలు, హైదరాబాద్, భద్రాచలం, కరీంనగర్లలో 44 డిగ్రీలు, అదిలాబాద్, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, నల్గొండలలో 42 డిగ్రీలు ఉంది.