రాజగోపాల్ రెడ్డికి ఊహించని సమస్య.. పార్టీ రాజీనామాపై ఎటూ తేల్చకుండా తాత్సారం.. కారణం ఇదేనట!!
నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాను కలవడంతో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నబోతున్నాడు అన్న చర్చ జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ మారకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ నేతలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన పార్టీ మారడం కోసం, కాషాయ కండువా కప్పడం కోసం బీజేపీ శ్రేణులు అంతే వ్యూహాలు రచిస్తున్నారు.

తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి ఎపిసోడ్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్, బిజెపి శ్రేణుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం అంటూ టిఆర్ఎస్ జరుగుతున్న పరిణామాలను ఆసక్తికరంగా పరిశీలిస్తుంది. పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం లోని పార్టీ ముఖ్యనేతలతో, అనుచరులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు.తన పార్టీ మార్పు నిర్ణయాన్ని అనుచరులకు తేల్చిచెప్పారు.

రాజగోపాల్ రెడ్డితో పాటు పార్టీ మారబోమన్న పలువురు నియోజకవర్గ కాంగ్రెస్ కీలక నేతలలు
తాను రాజీనామా చేస్తే మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని అప్పుడు హుజురాబాద్ తరహాలో మునుగోడు కూడా అభివృద్ధి చెందుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనతో భేటీ అయిన పార్టీ నాయకులకు చెప్పినట్టు సమాచారం. అయితే కొంతమంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని అంగీకరిస్తే, చాలామంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తనతో వేరే పార్టీకి వచ్చేది లేదని కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తన బలంగా భావిస్తున్న అనేకమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందిగ్ధంలో పడ్డారని సమాచారం .

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి
ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నుండి బయటకు వెళ్లకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న భట్టివిక్రమార్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో చర్చలు జరిపితే ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో భేటీ కావాలని నిర్ణయించి, రాజగోపాల్ రెడ్డి డిమాండ్లు ఏంటని ఆయన అడిగినట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న అంశంపై కూడా దిగ్విజయ్ సింగ్ మాట్లాడినట్టు తెలుస్తోంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధినాయకత్వం నుండి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో కూడా ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

రాజగోపాల్ రెడ్డి అనుకున్నది ఒకటి అయ్యింది ఒక్కటా .. ఆయనకు షాకిచ్చిన నియోజకవర్గ నేతలు
ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరడానికి మరొక వారం సమయం కావాలని బిజెపి నాయకులను కోరినట్లుగా తెలుస్తుంది. ఇక అన్ని రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకున్న తర్వాతనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై ఆలోచించే అవకాశం ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఆధిపత్యాన్ని అసలే జీర్ణించుకోలేకపోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకుని, తనతో పాటు తన అనుచరగణం అంతా వస్తుందని భావిస్తే, చాలామంది నాయకులు తాము కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పడం ఆయనను తీవ్ర నిరాశకు గురి చేసింది.

కోమటిరెడ్డి బ్రదర్ తాత్సారం వెనుక ఆ భేటీలే కారణం
ఈ క్రమంలోనే మరో వారం రోజుల పాటు వేచి చూసి వీలైతే తనతో కలిసి కీలకంగా పనిచేసిన నాయకులను, మరోమారు బుజ్జగించి పార్టీ మార్పు పై వారి అంగీకారంతో బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో ముఖ్య నాయకులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను పోగొట్టుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కూడా వారం రోజుల లోపు ఏదైనా జరగొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ పార్టీ మార్పు పై కోమటిరెడ్డి బ్రదర్ తాత్సారం వెనుక తాజాగా ఆయన నిర్వహించిన నియోజకవర్గ నేతల భేటీలు ఉన్నాయని ఆసక్తికర చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications