మీరు మాకు వద్దు, అభ్యర్థిని మార్చండి: బద్దం బాల్రెడ్డికి నేతల గట్టి షాక్
రాజేంద్రనగర్: ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ పార్టీలలో అసంతృప్తులు బయటకు వస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తమకు నచ్చని అభ్యర్థిపై విమర్శలు చేస్తూ పలువురు నేతలు, కార్యకర్తలు బయటకు వస్తున్నారు. అభ్యర్థిని మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బీజేపీకి కూడా ఆ సెగ తగిలింది.
ఆ సర్వేలతో సంబంధం లేదు, మెదక్లో పోటీ చేయమంటున్నారు: లగడపాటి, జగన్ మీద దాడిపై...
రెండో జాబితాతో బయటకు అసంతృప్తులు
మొదటి జాబితా విడుదల చేసినప్పుడు పెద్దగా ఇబ్బంది కనిపించలేదు. కానీ ఇటీవల రెండో జాబితా విడుదల చేసిన తర్వాత పలు నియోజకవర్గాల్లో అసంతృప్తులు బయటకు వస్తున్నారు. రాజేంద్రనగర్ నియోకవర్గం టిక్కెట్ను సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డికి ఇచ్చారు.
మీరు వద్దని కలిసి చెప్పారు
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే మీ అభ్యర్థిత్వం మాకు ఇష్టం లేదని బద్దంకు ముఖం మీదే చెప్పాశారు నియోజకవర్గం నాయకులు. ఆయనకు ఈ మేరకు వినతిపత్రం కూడా ఇచ్చారు. బద్దం అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన నాయకత్వంలో పని చేయలేమని చెబుతున్నారు.
పలువురు సీనియర్లకు విజ్ఞాపనలు
శనివారం మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, సీనియర్ నేత కిషన్ రెడ్డి, జాతీయ నాయకులు మురళీధర్ రావు తదితరులకు కూడా నేతలు వినతిపత్రం అందించారు. బీజేపీ కోర్ కమిటీలోని సభ్యులందరికీ వినతిపత్రాలు ఇవ్వాలని కూడా వారు నిర్ణయించారు.
పార్టీ తప్పుకోమంటే తప్పుకుంటానని బద్దం
ఈ కోర్ కమిటీ సభ్యుల నేతృత్వంలోనే అభ్యర్థుల జాబితాకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీకి వెళ్లాయి. అయితే ఈ కోర్ కమిటీలో బద్దం బాల్రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. అందరికీ వినతిపత్రాలు ఇచ్చిన నాయకులు... బద్దంకు కూడా అభ్యర్థిని మార్చడంపై ఆలోచన చేయాలని వినతిపత్రం ఇచ్చారు. దీనిపై ఆయన కూడా స్పందించారు. పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేస్తున్నానని, పార్టీ తప్పుకోమంటే తప్పుకొంటానని చెప్పారు. కాగా, బీజేపీలో రెండు దఫాలుగా అరవై మందికి పైగా అభ్యర్థులను ప్రకటించారు. మొదటి దఫాలో ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో 28 మంది పేర్లు విడుదల చేశారు. అయితే ఈ జాబితాపై నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లో అసంతృప్తులు కనిపించాయి. వరంగల్ వెస్ట్ స్థానాన్ని ధర్మారావుకు కేటాయించారు. దీనిపై పార్టీ నాయకురాలు రావు పద్మ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆరుసార్లు ఓడిపోయిన ధర్మారావుకు టిక్కెట్ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. వరంగల్ వెస్ట్ టిక్కెట్ తనకు కేటాయించాలని కోరుతున్నారు. నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించారు. ఇక్కడ టిక్కెట్ ఆశిస్తున్న వారు వ్యతిరేకిస్తున్నారు. శేరిలింగంపల్లి టిక్కెట్ను యోగానంద్కు కేటాయించారు. దీనిపై స్థానిక నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.