రోహిత్ ఆత్మహత్య: విహెచ్ మౌనదీక్ష, వర్సిటీల బంద్, ఆగని పోరు
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు బుధవారం మౌన దీక్ష చేపట్టారు.
దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయమన్న కాంగ్రెస్పైనే నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. హెచ్సీయూ వీసీని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్నేత వీహెచ్ డిమాండు చేశారు.
కాగా, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా యూనివర్సిటీల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఓయూలో తరగతులను బహిష్కరించారు. ఓయూలో విద్యార్థులు ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. రాజమండ్రిలోని నన్నయ్య యూనివర్సిటీలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఓయులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను విద్యార్థి సంఘాలు మూసివేయించడానికి ప్రయత్నించారు.
పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరాహారదీక్షలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమరణ దీక్ష చేపట్టిన ముబ్బషీర్ ఆహ్మద్ అస్వస్థతకు గురికావడంతో వర్సిటీ అధికారులు ఆయనను క్యాంపస్లోని హెల్త్సెంటర్కు తరలించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్..
మంగళవారం కూడా పలు సంఘాలు, సామాజిక కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. రోహిత్ తల్లికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.
రచయిత్రుల సంఘీభావం
విద్యార్థులకు సంఘీభావం ప్రకటించినవారిలో రచయిత్రులు సుజాత, శ్యామల, జూపాక సుభద్ర, తెలంగాణ అమ్మల సంఘం అధ్యక్షురాలు అల్లం పద్మ, వేముల శ్రీదేవి, ఆర్ వాణి, టీ మంజుల, ఘంటా చంద్రమౌళి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, యూత్ కాంగ్రెస్ రవికుమార్ యాదవ్, రచయిత కే శివారెడ్డి, సామాజిక ఉద్యమకారులు యూ సాంబశివరావు, రామచంద్రనాయక్, సురేశ్నాయక్, మధ్యప్రదేశ్ అలిండియా బౌద్ధ సంఘం అధ్యక్షుడు అజయ్ బౌద్ధ, ఆర్కే మెహాలే, కేరళ, ఢిల్లీ నుంచి వచ్చిన పలువురు సామాజిక కార్యకర్తలు ఉన్నారు.