ఆ బాధతో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య: కంటతడి పెట్టించేలా..
ఆదిలాబాద్: వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. అక్కకు ఇటీవలే వివాహం కూడా కుదిరింది. అప్పటినుంచి ఇద్దరిలోనూ ఏదో తెలియని బెంగ. పెళ్లయితే విడిపోవాల్సి వస్తుందన్న ఆందోళన. దీంతో మానసికంగా కుమిలిపోయిన ఆ ఇద్దరు చివరకు ఆత్మహత్య చేసుకున్ని కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చారు.

అంజుల-అర్చన..:
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బోందిడి గ్రామానికి చెందిన అడె అంజుల(19)కు ఇటీవలే వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి కుదిర్చినప్పటి నుంచి అంజుల మనస్తాపంగా ఉంటోంది. వద్దన్నా.. పెళ్లి చేస్తున్నారని బాధపడింది. పెళ్లయితే మనం దూరమవాల్సి వస్తుందని చెల్లెలు అర్చన(18)తో చెప్పుకుని బాధపడింది.

చేనుకు వెళ్తున్నామని:
ఆదివారం చేను వద్దకు వెళ్లి వస్తామని చెప్పి ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అలా హైదరాబాద్ బస్సు ఎక్కి నగరం చేరుకున్నారు. మళ్లీ ఇక్కడి నుంచి గురువారం తెల్లవారు జామున ఇచ్చోడ మండల కేంద్రానికి, అక్కడి నుంచి సిరికొండ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆపై స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశారు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య:
అనంతరం పురుగుల మందు తాగిన ఆ ఇధ్దరు సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద అపస్మారక స్థితిలో పడిపోయారు. గమనించిన స్థానికులు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అంజుల శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది.

స్థానికుల కంటతడి:
అదేరోజు ఉదయం 9గం. అర్చన కూడా ప్రాణాలు విడిచింది. ఈ ఇద్దరు ఒకరి పేరును మరొకరు తమ చేతులపై గోరింటాకుతో రాసుకోవడం గమనార్హం. చనిపోయాక వారి చేతులపై ఉన్న పేర్లు చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications