దొంగతనాలు: మాదాపూర్లో తెలివైన సాప్ట్వేర్ ఇంజనీర్ సీసీటీవీకి చిక్కాడు
హైదరాబాద్: సాప్ట్వేర్ ఉద్యోగుల పర్సులు, సెల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు దొంగిలించిన నిందితుడిని సీసీ కెమెరాలు పట్టించాయి. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మాదాపూర్లోని టెక్ మహీంద్రా కంపెనీలో టింకుల్ అరోరా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన ఇతడు దొంగతనాలు చేయడం ఆరంభించాడు.
వసతి గృహాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగుల సెల్ఫోన్లు పర్సులు దొంగిలించేవాడు. అనంతరం పర్సుల్లోని ఏటీఎం కార్డులను తీసుకుని సంబంధిత బ్యాంక్కు ఫోన్ చేసి తన ఏటీఎం ఫిన్ నంబర్ మరిచిపోయానని, కొత్త పిన్ నంబర్ ఇవ్వమని అడుగుతాడు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు అడిగిన వివరాలను పర్సులో ఉండే గుర్తింపు కార్డులు చూసి చెబుతాడు.
దీంతో బ్యాంక్లో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచే ఫోన్ రావటం, కావాల్సిన వివరాలు చెప్పడంతో బ్యాంక్ సిబ్బంది వెంటనే కొత్త నంబర్ మొబైల్ నెంబర్కు పంపడం జరుగుతుంది. దీంతో వెంటనే సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రానికి వెళ్లి నగదును విత్ డ్రా చేసుకుంటాడు.
పైవిధంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ను మాదాపూర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మాదాపూర్లోని ఓ హాస్టల్లో ఉంటున్న నితేశ్కుమార్ నిద్రిస్తున్న సమయంలో సెల్ఫోన్, పర్సు చోరీకి గురైందని ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ నెల 23న ఇదే తరహా దొంగతనం జరిగిందని సుమిత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోలీసులకు తెలిపాడు. వీళ్లిద్దరి పర్సు, ఫోన్ చోరీ అయిన అరగంటకే ఏటీఎం కార్డులోంచి నగదు సైతం మాయమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇనార్బిట్ మాల్లోని యాక్సెస్ బ్యాంకు ఏటీఎం నుంచి రూ. 40 వేలు, సుమిత్ దువ్వా ఏటీఎం కార్డు ఉపయోగించి మాదాపూర్లోని ఐసీఐసీఐ ఏటీఎం నుంచి రూ. 82 వేలు డ్రా చేశాడు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన సమయాన్ని బట్టి పోలీసులు ఆయా ఏటీఏం కేంద్రాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.
నిందితుడు తలకు హెల్మెట్ పెట్టుకొని ఏటీఎంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితుడు డబ్బులు డ్రా చేసి బైకు వెళ్తున్న దృశ్యాలు నమోదు కావడంతో బైకు నెంబర్ AP31AT4645 ఆధరాంగా పోలీసులు నిందితుడి వివరాలు సేకరించారు.
హర్యానాకు చెందిన ట్వింకిల్అరోరా(27) టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ అరుణోదయ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు.
ఇలా రెండు దొంగతనాలు చేసిన ట్వింకిల్ అరోరా ఆయా ఏటీఎంల నుంచి రూ.1.20లక్షల నగదును కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని బుధవారం అరెస్టు చేసి అతని వద్ద రూ.1.02లక్షల నగదు, ద్విచక్రవాహనం, ఏటీఎం కార్డులు, పర్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.