కృష్ణా నదిలో పడి ఈత రాక సాప్ట్వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: ఈత రాక కృష్ణా నదిలో పడి సాప్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన నాగార్జున సాగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్లోని అమీర్ పేట్లో సాప్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విశ్వజిత్కుమార్(25) తన ఇద్దరు స్నేహితులు రాకేష్, అరవింద్లతో కలిసి సోమవారం నాగార్జున సాగర్ అందాలను ఆస్వాదించడానికి ఉదయం అక్కడికి చేరుకున్నారు.
వీరు ద్విచక్రవాహనంపై వచ్చి సాగర్ అందాలను చూస్తూ సాగర్ ప్రధాన డ్యాం, కొత్త బ్రిడ్జి వద్ద సాగర్ అందాలను వీక్షించారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు వెళ్తూ హిల్కాలనీ మొసళ్ల జోన్ (బండలపురి) వద్ద వాహనం ఆపి సమీపంలోని నది వద్దకు వెళ్లారు.
నది ఒడ్డున మత్స్యకారులు చేపలు పట్టే పుట్టి ఉండటం గమనించి సమీపంలో ఎవరూ లేకపోవడంతో విశ్వజిత్కుమార్ ఒడ్డున ఉన్న చేపల పుట్టిని నదిలోకి లాక్కొచ్చి దానిపై కూర్చున్నాడు. చేపల పుట్టి అటూ ఇటూ గాలికి వెళ్తూ నది మధ్యలోకి వెళ్లడంతో భయంతో అతను నదిలోకి దూకాడు.
ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. ఒడ్డున ఉన్న స్నేహితులు గట్టిగా అరుపులు కేకలు వేసినా ఎవరూ రాకపోడవడంతో ఏమీ చేయలేకపోయారు. దీంతో జరిగిన విషయాన్ని స్ధానిక టూరిజం అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్దలానికి చేరుకున్నారు.
స్థానిక మత్స్యకారులను పిలిపించి చేపల పుట్టిలో నదిలోకి వెళ్లి మృతదేహం కోసం గాలించి రెండు గంటల తర్వాత మృతదేహాన్ని గుర్తించి బయటకు తీయించారు పోలీసులు. విశ్వజిత్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రజనీకర్ తెలిపారు. విశ్వజిత్ స్వగ్రామం బీహార్ కావడంతో వారి కుటుంబానికి సమాచారం అందించారు.