ఎన్టీఆర్ సినిమాకు పాట: లగడపాటికి సినారె సై తెలంగాణ జవాబు
సి. నారాయణ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా, ప్రగతిశీల భావజాలానికి వ్యతిరేకంగా పనిచేశారనే అభిప్రాయం బలంగా ఉంది. కానీ అది నిజమేనా...
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కాలంలో సి. నారాయణ రెడ్డి ఎన్టీ రామారావు తల్లా, పెళ్లామా అనే సినిమాకు రాసిన పాట వివాదంగా మారింది. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని రాసిన పాట తెలుగు ప్రజల సమైక్యతను కోరుతోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు వ్యతిరేకంగా ఉందని వాదించినవాళ్లు ఉన్నారు.
ఆ పాటను సమైక్యాంధ్ర ఉద్యమకారులు తమ ఆయుధంగా వాడుకునే ప్రయత్నాలు చేశారు. తెలంగాణకు చెందిన సి. నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని ప్రచారం చేశారు. నిజానికి, ఆ పాటను ఎన్టీఆర్ తన సినిమాలో సందర్భం లేకుండా వాడారనే విమర్శ కూడా ఉంది.
ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఆ పాటను వాడుకున్నారనే విమర్శ ఉంది. అయితే, నిజంగానే సి. నారాయణ రెడ్డి రెండో విడత తెలంగాణ ఉద్యమం ఎగిసినప్పుడు తెలంగాణకు అనుకూలంగానే ప్రకటన చేశారు.
తెలంగాణ భాష గురించి....
స్వచ్ఛమైన తెలుగు భాష తెలంగాణ ప్రజలదేనని సి. నారాయణ రెడ్డి సభాముఖంగా ప్రకటించారు. పాత కరీంనగర్ జిల్లా వేములవాడలో ఆయన ఓ సభలో మాట్లాడుతూ ఆ ప్రకటన చేశారు. ఆయన చెప్పిన మాటలు పత్రికల్లో అచ్చయ్యాయి. వాటిని నెటిజన్లు ఫేస్బుక్లో షేర్ చేశారు.
లగడపాటికి సినారె జవాబు...
తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అనే పాటను సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వాడుకోవడానికి ప్రయత్నిించారు. ఆయన తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించి, లగడపాటి రాజగోపాల్కు జవాబు చెప్పారు. దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఏడు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉంటే అభ్యంతరం ఎందుకని ఆయన అడిగారు. తెలంగాణ రచయితల సమావేశంలో ఆయన తన వైఖరిని ప్రకటించారు.
తెలంగాణకు సై అన్నారు....
జై తెలంగాణ అంటే.... సై తెలంగాణ అని సి. నారాయణ రెడ్డి తెలంగాణ రచయితల సభలో నినదించారు. కేంద్రంలో ఎన్డీయె అధికారంలో ఉన్నప్పుడు తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని, చిన్న రాష్ట్రాలే శ్రేయోదాయకమని ఎన్డీఎ ప్రభుత్వం ప్రకటించినప్పుడు తాను దాన్ని స్వాగతించినట్లు కూడా చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తాను విద్యార్థిగా ఉన్న సమయంలో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
రాజీ ధోరణి వహించారా....
విప్లవ సాహిత్యం తెలంగాణను ముంచెత్తిన కాలంలో సి. నారాయణ రెడ్డి తనదైన బాటను ఎంచుకున్నారు. అయితే, ఆయన అభ్యుదయ భావజాలానికి ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేయలేదు. తనది మానవతావాదం అన్నారే తప్ప విప్లవ, ప్రగతిశీల ఉద్యమాలను ఆయన వ్యతిరేకించలేదు. విప్లవ కవి శ్రీశ్రీ సమావేశాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. విప్లవ రచయితల సంఘం (విరసం)పై ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు దానికి వ్యతిరేకంగా గళమెత్తిన సాహిత్యవేత్తల్లో సినారె ముందున్నారు.