తెలంగాణ ఐటీ పాలసీ విడుదల: సరిగ్గా ఏడాది క్రితం ఇలాగే.. కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు కొత్త ఐటీ పాలసీని ప్రకటించింది. హైదరాబాదులోని హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ మంత్రి కెటి తారక రామారావు తదతరులు పాల్గొన్నారు.
కెటిఆర్ మాట్లాడుతూ... 'ఐటీ రంగానిరి హైదరాబాద్ కేంద్రమైంది. దేశ ఐటీ రంగానికి తెలంగాణ కీలకం. ఐటీ రంగంలో వినూత్న విధానాలను తీసుకు వస్తున్నాం. ఐటీ రంగంలో హైదరాబాదును ప్రథమ స్థానంలో నిలపడమే మా లక్ష్యం. ఐటీ రంగ పురోగతికిఅవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
గ్రామీణ, పట్టణ యువతను ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీని తీసుకు వచ్చాం. ఇప్పటికే గేమింగ్, యానిమేషన్ కంపెనీలు హైదరాబాదులో ఉన్నాయి. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టి హబ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ఐటీ విధానాన్ని ప్రవేశ పెడుతున్నాం.
రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు అద్భుతమైన అవకాశాలున్నాయి. గేమింగ్, యానిమేషన్ రంగాలకు ఇతర రాష్ట్రాలలో లేని విధంగా ప్రోత్సాహం. ఇన్నోవేషన్, గేమింగ్, రూరల్ టెక్, ఎలక్ట్రానిక్ విధానాలు ప్రకటిస్తున్నాం. ఐటీ పాలసీకి అనుబంధంగా నాలుగు సబ్ పాలసీలు విడుదల చేస్తున్నామ'ని మంత్రి కెటిఆర్ చెప్పారు.
సరిగ్గా ఏడాది క్రితం తాము పారిశ్రామిక విధానం ప్రకటించామని సీఎం కెసిఆర్ చెప్పారు. 1691 కంపెనీలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సింగిల్ విండో విధానం తాము ప్రకటించామని తెలిపారు. ఐటీ రంగానికి తెలంగాణ అనువైన ప్రాంతమని చెప్పారు.
పారిశ్రామిక సంస్థలకు సంస్థలకు కేవలం పదిహేను రోజుల్లో అనుమతులు ఇచ్చామన్నారు. వీటిల్లో అవినీతికి తావులేదన్నారు. తెలంగాణలోని వాతావరణం, ప్రజలు, విధానాలు వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయన్నారు. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆయన వ్యాపారవేత్తలకు సూచించారు.
గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. టెక్నాలజీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయమన్నారు. టెక్నాలజీ గ్రామీణ ప్రాంతాలకు చేరకుంటే అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. రూరల్ టెక్నాలజీకి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
అంతకుముందు, రూరల్ టెక్నాలజీ పాలసీని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆవిష్కరించారు. తొలికాపీని హోం మంత్రి నాయుని నరసింహా రెడ్డికి అందించారు. ఎలక్ట్రానిక్ - డిజైనింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సారస్వత్ ఆవిష్కరించారు.