కొలువుదీరనున్న అసెంబ్లీ... అమరవీరులకు కేసీఆర్ నివాళి
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రెండోసారి కొలువుదీరనుంది. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీకి వచ్చే ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. హోం మినిస్టర్ మహమూద్ అలీ, హరీశ్ రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, పద్మారావు తదితరులు కూడా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు.
తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఎన్నికపై నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. శుక్రవారం నాడు ఎమ్మెల్యేలు స్పీకర్ ను ఎన్నుకుంటారు. తెలంగాణ అసెంబ్లీలో మరోసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అయితే స్పీకర్ ఎన్నిక విషయంలో అభ్యర్థిని నిలబెట్టొద్దని డిసైడయ్యారు. దీంతో స్పీకర్ ఎన్నిక లాంఛనం కానుంది. అధికార పార్టీ సూచించినవారే స్పీకర్ గా ఏకగ్రీవం కానున్నారు.
ఎమ్మెల్యేలుగా గెలిచి నెలరోజులు దాటినా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి 37 రోజులవుతోంది. ఎట్టకేలకు గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుకానుండటంతో చివరకు 38వ రోజున ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వివిధ కారణాలతో ఇప్పటివరకు ఆలస్యమైనా.. ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో అడుగుపెడతామా అంటూ కొత్తగా ఎన్నికైనవారు ఎదురుచూసిన పరిస్థితి. మొత్తానికి ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ కావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండోసారి కొలువుదీరుతున్న అసెంబ్లీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 23 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇద్దరు ఎంపీలతో పాటు ముగ్గురు ఎమ్మెల్సీలు... ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.