జల వివాదాలకు ఒకే ట్రిబ్యునల్: స్వాగతించిన తెలంగాణ, భిన్నంగా ఏపీ
దేశంలోని రాష్ట్రాల మధ్య తీవ్రమవుతున్న జల వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: దేశంలోని రాష్ట్రాల మధ్య తీవ్రమవుతున్న జల వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసింది. దీంతోపాటు అవసరమైనప్పుడు వివాదాలను విచారించడానికి వీలుగా కొన్ని ధర్మాసనాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956ను సవరించాలని నిర్ణయించింది.
అయితే ప్రతిపాదిత ట్రిబ్యునల్ తరహాలో ఈ ధర్మాసనాలు శాశ్వతం కావు. సదరు వివాదం పరిష్కారం కాగానే అవి రద్దవుతాయి. ఈ మేరకు చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు తదుపరి సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్కు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఛైర్పర్సన్గా ఉంటారని జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి శశి శేఖర్ చెప్పారు. ఇంతకుముందు జలవివాదాలు పరిష్కారం కావడానికి యుగాలు పట్టేదని తెలిపారు. కొత్త ట్రిబ్యునల్ వల్ల మూడేళ్లలోనే తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు.
ట్రిబ్యునల్తోపాటు వివాద పరిష్కార కమిటీ (డీఆర్సీ) ఏర్పాటునూ ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ఇందులో నిపుణులు, విధాన నిర్ణేతలు ఉంటారని వివరించారు. ట్రిబ్యునల్ కన్నా ముందు వివాదాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. చాలావరకూ వివాదాలు డీఆర్సీ స్థాయిలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని, దీనిపై సంతృప్తి చెందని రాష్ట్రం ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చని చెప్పారు.

ట్రిబ్యునల్కు మరిన్ని అధికారాలు ఇవ్వడం కోసం.. అదిచ్చే తీర్పు దానంతట అదే నోటిఫై అయ్యేలా సవరణ బిల్లులో ప్రతిపాదిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వమే ఈ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వస్తోందని, ఫలితంగా తీర్పు అమలులో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత చట్టం ప్రకారం.. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సంతృప్తి చెందినప్పుడు మాత్రమే కేంద్రం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 8 ట్రైబ్యునళ్లు ఉన్నాయి.
స్వాగతించిన తెలంగాణ: మరింత ఆలస్యమని ఏపీ
కాగా, ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు నిర్ణయం పట్ల తెలంగాణ సర్కారు హర్షం వ్యక్తం చేసింది. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో జల వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయని వెల్లడించింది. తెలంగాణకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ఒకే ట్రిబ్యునల్ మూలంగా సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని తెలిపారు.
అయితే, ఏపీ మాత్రం భిన్నంగా స్పందించింది. కేంద్ర నిర్ణయంతో జల వివాదాల పరిష్కారం మరింత ఆలస్యమవుతుందని పేర్కొంది. ఒకే ట్రిబ్యునల్ మూలంగా జల వివాదాలు పరిష్కారం ఆలస్యమవడంతోపాటు రాష్ట్రాల మధ్య ఇతర వివాదాలు కూడా చెలరేగే అవకాశాలున్నాయని ఏపీ మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. జల వివాదాల పరిష్కారానికి ఒకే ట్రిబ్యునల్ నిర్ణయం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications