నాగంపై టీఆర్ఎస్ కార్యకర్తల ఎటాక్ : ఖబర్దార్ అంటూ వార్నింగ్..!
మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించినట్టుగా సమాచారం.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో మీడియా సమావేశానికి హాజరైన నాగంతో వాగ్వాదానికి దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాడి చేయడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్టుల విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో 'ఖబడ్ధార్.. నాగం' అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నాగంను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
టీఆర్ఎస్ నేతలు నాగం మీడియా సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నంతో చేయడంతో బీజేపీ నేతలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలు ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా, పలువురు ఆందోళనకారులు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ అద్దాలను ధ్వంసం చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించారు.

కాగా, తనను అడ్డుకోబోయిన టీఆర్ఎస్ కార్యకర్తలను వారిస్తూ.. తెలంగాణ అభివృద్ధికి తాను అడ్డుపడడం లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని మాత్రమే తాను ప్రశ్నిస్తున్నాని చెప్పుకొచ్చారు నాగం. పాలమూరు ఎత్తిపోతల పథకం వ్యయాన్ని రూ.35 వేల కోట్ల నుంచి రూ.60 కోట్లకు పెంచడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించిన నాగం, ప్రాజెక్టుల్లో అక్రమాలపై తాను పోరాడతానన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం అర్హత లేని కాంట్రాక్టర్లకు ప్రాజెక్టుల పనులను అప్పగిస్తోందని ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు నాగం జనార్దన్ రెడ్డి.












Click it and Unblock the Notifications