టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు: రూ.1కోటి ఇవ్వాలని వ్యాపారవేత్తకు బెదిరింపులు..
రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది.
హైదరాబాద్: రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. రూ.1కోటి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే తనను బెదిరింపులకు గురిచేస్తున్నాడంటూ జి. మోహన్రెడ్డి అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
డబ్బు ఇవ్వడానికి జి. మోహన్రెడ్డి నిరాకరించడంతో.. అనుచరులను వెంటేసుకుని అతని ఇంటికి వెళ్లిన ప్రకాష్ గౌడ్ హల్ చల్ చేసినట్టు తెలుస్తోంది. మోహన్ రెడ్డి ఇంటి ప్రహారీ గోడను కూల్చడమే గాక, చంపేస్తామని బెదిరించినట్టు తెలుస్తోంది. దీంతో ప్రకాశ్గౌడ్పై బాధితుడు మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆక్రమణ, క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
మరోవైపు ప్రకాష్ గౌడ్ వాదన మాత్రం మరోలా ఉంది. ప్రస్తుతం మోహన్ రెడ్డికి చెందిన ఆ భూమి ఒకప్పుడు కాలిబాటగా ఉండేదని, తిరిగి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాల్సిందిగా ప్రజలు తనను కోరారని చెబుతున్నారు. అందువల్లే జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల సమక్షంలోనే ప్రహరీని కూల్చివేసినట్టు తెలిపారు.
మోహన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే, అతని అనుచరులు కలిసి జేసీబీతో ప్రహరీ గోడను కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాలిబాటకు ప్రత్యామ్నాయ మార్గాలున్నా.. ఉద్దేశపూర్వకంగానే తనను బెదిరించారని మోహన్ రెడ్డి ఆరోపించారు. హరీని కూల్చేస్తున్నప్పుడు పోలీసులు కానీ, జీహెచ్ఎంసీ అధికారులు కానీ లేరని మోహన్ రెడ్డి పేర్కొనడం గమనార్హం.