కాంగ్రెస్ నేత పిజెర్పై కవిత ప్రశంసలు, కిషన్ రెడ్డి ఇలాకాలో కెటిఆర్ సవాల్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ దివంగత నేత పిజెఆర్ (పి జనార్ధన్ రెడ్డి) ఆశయానికి కృషి చేస్తామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి పిజెఆర్ అని కితాబిచ్చారు.
పీజేఆర్ ఆరో వర్థంతి సందర్భంగా ఖైరతాబాద్లోని ఆయన విగ్రహానికి కవితతో పాటు పీజేఆర్ కుమార్తె, టిఆర్ఎస్ నాయకురాలు విజయా రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన మహానాయుడు పీజేఆర్ అన్నారు.
బతికినంత కాలం పేదల అభ్యున్నతి కోసం తపించిన నేత పీజేఆర్ అన్నారు. ఆయన ఆశలను, ఆశయాలను టీఆర్ఎస్ పార్టీ నెరవేరుస్తుందని చెప్పారు.
కిషన్ రెడ్డికి కెటిఆర్ సవాల్
తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం సవాల్ విసిరారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే కేంద్రం నుంచి రూ.లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకు రావాలన్నారు. లేదంటే ఉపన్యాసాలు మాని అభివృద్ధిలో సహకరించాలన్నారు.
హైదరాబాదులో పేదలకు పదివేల ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇళ్ల విషయంలో దళారుల మాటలు నమ్మవద్దని హితవు పలికారు. హైదరాబాద్లోని పేదలందరికీ గూడు కల్పిస్తామన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం కింద ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు.
అంబర్పేట గోల్నాకలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసమే ఉందని, అర్హులైన మహిళలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. ఓపెన్ నాలాలను పైప్ల ద్వారా మూసివేస్తామని, రవాణా పన్ను మాఫీ చేసి డ్రైవర్లకు అండగా నిలిచామన్నారు.