తప్పిన పెను ప్రమాదం: శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన టీఎస్ఆర్టీసీ బస్సు
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రాజెక్టు రక్షణ గోడను ఢీకొట్టింది
మహబూబ్నగర్: శ్రీశైలం ప్రాజెక్టు వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రాజెక్టు రక్షణ గోడను ఢీకొట్టింది. డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించలేకపోవడంతోనే ఘాట్ రోడ్లోని రక్షణ గోడను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ప్రమాదంలో రక్షణ గోడ ధ్వంసమైనప్పటికీ.. ఇనుప బారికేడ్ ఉండటంతో బస్సు లోయల పడకుండా అక్కడే ఆగిపోయింది. బస్సు ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే బస్సు నుంచి దిగి బయటకు వెళ్లారు.
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పెద్ద ప్రమాదం తప్పిందని వారంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, శ్రీశైలం ప్రాజెక్టు ఇరువైపులా ఉన్న ఘాట్ రోడ్ మలుపుల వద్ద రక్షణ గోడలు బలహీనంగా ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
ఇనుప రాడ్ ఉండటం వల్లే బస్సు లోయలో పడకుండా ఆగిపోయిందనే.. లేదంటే పెను విషాదం చోటు చేసుకునేదని ఆందోళన వ్యక్తం చేశారు.