కేసీఆర్పై ఉత్తమ్ ఘాటు విమర్శలు, మా ఎమ్మెల్యే దాడి వెనుక సీఎం ప్రోత్సాహం: డీకే అరుణ
హైదరాబాద్: రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతుంటే సీఎం కేసీఆర్ విహారయాత్రలు చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతును రక్షిద్దాం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు మహాబూబ్నగర్లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చైనా పర్యటనతో తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కరువపై వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాలను టీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందన్నారు. కేసీఆర్ ఆకాశంలో విహరిస్తూ పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో తొందరపాటు నిర్ణయాలతో పాలన అస్తవ్యస్తమైందని ఆయన అరోపించారు. అధికార అంహకారానికి కేసీఆర్ నిదర్శనంగా నిలిచారని జైపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ మా ఎమ్మెల్యేపై దాడి వెనుక సీఎం ప్రోత్సాహముందన్నారు.
కేసీఆర్ ఒక్క జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారు: ప్రకాష్గౌడ్
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకును రంగారెడ్డి జిల్లా వరకు రాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆరోపించారు. సోమవారం ఆయన రాజేద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అరికెపూడి గాంధీ మాట్లాడుతూ ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా 18,19,20 తేదీల్లో పాదయాత్రలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఒక్క జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారని ప్రకాష్గౌడ్ విమర్శించారు.