చంద్రబాబుకు-కేసీఆర్ కు పెద్ద తేడా ఏమి లేదు.. : భూసేకరణపై విజయ రాఘవన్
హైదరాబాద్ : రాజధానికి సంబంధించి ఏపీ సర్కార్.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం తెలంగాణ సర్కార్.. భూసేకరణకు సిధ్దమైన విషయం తెలిసిందే. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ.. పేదల భూములు లాక్కునే విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే పంథాను అనుసరిస్తున్నారని విమర్శించారు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ రాఘవన్.
భూసేకరణకు సంబంధించి పేదల నుంచి భూములు లాక్కోవడంలో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ మధ్య పెద్ద తేడా ఏమి లేదన్నారు విజయ్ రాఘవన్. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ రాఘవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల సీఎంల తీరును తప్పుబట్టారు. ప్రాజెక్టులు, రీడైజినింగ్, సచివాలయం పేరుతో సాకులు చెబుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్యాయంగా పేదల భూములను లాక్కుని వాటిని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
ఇక మల్లన్న సాగర్ విషయాన్ని ప్రస్తావించిన విజయ రాఘవన్.. ముప్పు బాధితులకు సీఎం కేసీఆర్ స్వయంగా నచ్చజెప్పేలా చర్యలు తీసుకోవాలె తప్ప బెదిరింపు చర్యలకు దిగవద్దన్నారు. మల్లన్న సాగర్ భూసేకరణ విషయంలో జీవో 123 అనుసరించడమే సరైన నిర్ణయమన్నారు.
అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతోన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోను కేసీఆర్ సర్కార్ విఫలమైందన్న తరహాలో వ్యాఖ్యలు చేసిన ఆయన, కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న ఒక్క ఎర్రవల్లిలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి గొప్పలు పోతున్నారని ఎధ్దేవా చేశారు. ప్రభుత్వాల పనితీరుతో పాటు రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, సాగునీరు, తాగునీరు వంటి తదితర అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.