గజదొంగల కంటే ఘోరంగా; కేసీఆర్ సర్కార్ కు పోయేకాలం దగ్గర పడింది: విజయశాంతి
తెలంగాణ బిజెపి నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ బిజెపి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. కరెంటు చార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచుతున్న విషయంపై సీఎం కేసీఆర్ పై విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మొన్న ఆర్టీసీ చార్జీలు.. ఇప్పుడు కరెంట్ చార్జీల పెంపు.. విజయశాంతి ఫైర్
నిన్నగాక మొన్న ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, ఇక నేడు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని విజయశాంతి సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. గజదొంగల కంటే ఘోరంగా ప్రభుత్వ వ్యవహారం ఉందని విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్కు పోయేకాలం దగ్గర పడింది అని పేర్కొన్న విజయశాంతి, అందుకే ప్రజలపై కరెంట్ చార్జీల పెంపుతో మోయలేని భారాన్ని వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదల నుండి మధ్య తరగతి వరకు ఎవ్వరినీ వదలకుండా కరెంటు షాక్ ఇచ్చింది టీఆర్ఎస్ సర్కారు అంటూ పేర్కొన్న విజయశాంతి ఈ నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే దాకా ప్రజల తరఫున కొట్లాడుతామంటూ వెల్లడించారు.

కేసీఆర్ సర్కార్ ను సాగనంపటం ఖాయం
పేదలను నిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు. అంతేకాదు కేసీఆర్ సర్కార్ నిరంతరం పేదలపై మోయలేని భారం మోపుతూ పేదల నడ్డి విరుస్తోందని విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. డిస్కమ్ లకు 17 వేల కోట్ల బకాయిలు ఉన్నారని, అందులో 12598 కోట్లు ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలు ఉన్నాయని విజయశాంతి పేర్కొన్నారు. ఇక వినియోగదారులు చెల్లించవలసిన బకాయిలు చూస్తే 4,603కోట్లు ఉన్నాయని తెలిపిన విజయశాంతి ఈ బకాయిలు లో ఎక్కువ శాతం పాతబస్తీలోనే ఉన్నాయని వెల్లడించారు.

పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము లేదు
మరోవైపు పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము లేదు అంటూ మండిపడిన విజయశాంతి ఈ లోటును పూడ్చేందుకు ప్రజలపై భారం మోపడం ఎంత వరకు న్యాయం? అని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు బీజేపీ పోరాటం సాగిస్తుంది అని విజయశాంతి స్పష్టం చేశారు. ఈ నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే దాకా ప్రజల తరపున కొట్లాడుతాం అని విజయశాంతి వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.6వేల కోట్ల భారాన్ని మోపడం దారుణం
రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.6వేల కోట్ల భారాన్ని మోపడం దారుణం అని పేర్కొన్న విజయశాంతి, ప్రభుత్వం ఒకవైపు తన శాఖలు వాడుకున్న కరెంట్కు బిల్లులు చెల్లించడం లేదు అంటూ మండిపడ్డారు. ఈ సర్కారు డిస్కమ్లకు కట్టాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు అని పేర్కొన్న విజయశాంతి ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ డిస్కమ్ లకు చెల్లించవలసిన బకాయిలను చెల్లించి కరెంటు చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications