నిరుద్యోగులతో హైదరాబాద్ ను దిగ్బంధిస్తాం.!అమ్మవారి సాక్షిగా సమరశంఖం పూరించిన కోదండ రామ్.!
హైదరాబాద్ : రాష్ట్రంలో చదువుకున్న యువత ఉద్యోగాలు రావని ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, త్వరలో ఉద్యోగాలల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని టీజేయస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేసారు. బోనాల పండుగ సందర్భంగా నాచారంలోని అమ్మవారిని కోదండరాం దర్శించుకున్నారు. నిరుద్యోగులతో హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తామని అమ్మవారిని మొక్కుకున్నట్టు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం నిరుద్యోగులపైన ఉండాలని, అందరికి ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిరుద్యోగుల పరిస్థితి ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అమ్మవారి ఆలయం నుండే సమరశంఖం పురిస్తున్నామని, లక్షలాది నిరుద్యోగులతో హైదరాబాద్ లో శక్తి ప్రదర్శన నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు.
Recommended Video
తెలంగాణ ఉద్యమ స్పూర్తితో సాగరహారం, సకలజనుల సమ్మె మాదిరిగా నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు ఉపాది కోల్పోయిన వారితో హైదరాబాద్ లో సభ నిర్వహించి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని కోదండరాం హెచ్చరించారు. రాష్ట్రంలో కాళిగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను తగ్గించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల పీఆర్సీ కి వేసిన బిస్వాల్ కమిటీ 1 లక్ష 91 వెయ్యి 126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక సమర్పించిందని, ఇందుకు విరుద్దంగా గులాబీ ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 50వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని నిరుద్యోగుకలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత కల్పించాలని, చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలని కోదండరాం డిమాండ్ చేసారు.