పవన్ నిచ్చెనగా.. తెలంగాణలోను కలుద్దాం: పవర్ స్టార్కు సీపీఎం లేఖ, ఎందుకో చూడాలని జనసేన
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. తెలంగాణలో కూడా మీతో కలిసి పని చేయాలని ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిరి తెలంగాణలోను కలిసి పని చేద్దామని ఈ మేరకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
చదవండి: పవన్ భవిష్యత్తు నాకు తెలియదు, మరి వాళ్లెందుకు మాట్లాడలేదు: సుమన్
Recommended Video
తమ్మినేని ప్రతిపాదనపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించింది. ఆయనతో ముఖాముఖి మాట్లాడాలని నిర్ణయించింది. ఈ మేరకు జనసేన నేత హరిప్రసాద్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంటులో ఆ లేఖను పోస్ట్ చేశారు.
తెలంగాణలో కలిసి పని చేద్దామని లేఖ
ప్రజా సమస్యలపై పోరాటంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నవ్యాంధ్ర ప్రదేశ్లో జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. అదే విధంగా తెలంగాణలోను కలిసి పని చేయాలని తమ్మినేని జనసేనానికి లేఖ రాశారని తెలిపారు. దీనిపై ప్యాక్ (జనసేన రాజకీయవ్యవహారాల కమిటీ)లో చర్చించాలని పవన్ సూచన చేశారని చెప్పారు.
ముందస్తు ప్రచారం నేపథ్యంలో
పవన్ కళ్యాణ్ సూచనతో ఈ రోజు (సోమవారం) ప్యాక్ హైదరాబాదులో సమావేశమైందని చెప్పారు. జనసేన పార్టీలోని తెలంగాణ నేతలతో సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ లేఖ రావడంతో సీపీఎం నేతలతో ముఖాముఖి చర్చించాలని ప్యాక్ నిర్ణయించిందని పేర్కొన్నారు.
ఎన్నికల కోసమా, ప్రజా సమస్యలపై పోరాటమా చూడాలి
కలిసి పని చేయడం ప్రజా సమస్యల పరిష్కారంలోనా లేక వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. సీపీఎం నేతలను జనసేన పార్టీ కార్యాలయానికి ఆహ్వానించాలని ప్యాక్ నిర్ణయించిందన్నారు. సీపీఎంతో సమావేశం అనంతరం ప్యాక్ తమ పార్టీ అధినేతకు ఓ నివేదిక సమర్పిస్తుందన్నారు. ఆ తర్వాత నిర్ణయం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ నిచ్చెనగా
కాగా, లెఫ్ట్ పార్టీలు జనసేనానిని నిచ్చెనలా ఉపయోగించుకుందామని భావిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీల ప్రభ క్రమంగా మసకబారుతోంది. ఈ క్రమంలో పవన్ అందివచ్చిన అవకాశంలా భావిస్తున్నారని, ఆయన ద్వారా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో లబ్ధి పొందాలని, పార్టీల ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.