గజవాహనంపై పద్మావతి అమ్మవారు దర్శనం.. తరించిన భక్తులు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు శనివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
గజం ఐశ్వర్య సూచకం. అందుకే ''ఆగజాంతగం ఐశ్వర్యం'' అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని చెబుతారు.
వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, జెఈఓలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసుదన్, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
ముంబైకి చెందిన శంకర్ నారాయణ అనే భక్తుడు శనివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.6 లక్షల విలువైన 77 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను ఆలయంలో అధికారులకు అందజేశారు.