టీడీపీకి వైసీపీ కౌంటర్.. త్వరలో బీసీ డిక్లరేషన్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు టీడీపీ, వైఎస్ఆర్ పార్టీల మధ్య జంపింగుల పర్వం కొనసాగుతుంటే.. మరోవైపు బీసీ మంత్రం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆది నుంచి టీడీపీకి అండగా ఉన్న బీసీలను మరోసారి ఆకర్షించేలా.. జయహో బీసీ సదస్సులు నిర్వహిస్తున్న టీడీపీకి దీటుగా వైఎస్ఆర్ పార్టీ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఎన్నికల మంత్రం.. బీసీ జపం
ఏపీ ఎన్నికల వేళ బీసీ మంత్రం అందుకున్నాయి ప్రధాన పార్టీలు. టీడీపీ ఇప్పటికే జయహో బీసీ సదస్సులు నిర్వహిస్తుండగా.. బీసీ డిక్లరేషన్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఆ మేరకు మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. తెలుగుదేశం పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని ఆరోపించిన సుబ్బారెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు చేసిందేమీ లేదన్నారు. ఏపీలో బీసీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
జగన్ తోనే బీసీలకు న్యాయం..!
బీసీలకు న్యాయం చేసే విషయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని.. ఆయన ఆదేశాలతో ఏడాదిన్నర కిందటే బీసీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. జగన్ ఆదేశాల మేరకు ఆ కమిటీ బీసీల పరిస్థితిపై అధ్యయనం చేసిందన్నారు. ఆ మేరకు బీసీ కుల సంఘాలతో భేటీ అయి రిపోర్టు కూడా తయారుచేశామని చెప్పారు. ఏలూరులో వచ్చే నెల 17న జరిగే బీసీ గర్జన సభలో జగన్ బీసీ డిక్లరేషన్ వెల్లడిస్తారని చెప్పుకొచ్చారు.
బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
చంద్రబాబు ఇటీవల బీసీ మంత్రం జపించడం మరోసారి మోసం చేయడానికే అంటూ ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ సెల్ ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి. బీసీలపై ప్రేమ కురిపిస్తున్నట్లుగా చంద్రబాబు మాట్లాడే తీరు.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీలకు న్యాయం చేయడమంటే అది జగన్ వల్లే సాధ్యమవుతుందనే విషయం బీసీ వర్గాలు అర్థం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రమంతటా పర్యటించిందని.. వివిధ సమస్యలను గుర్తించడంతో వాటి పరిష్కారం జగన్ బీసీ డిక్లరేషన్ లో ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. బీసీ కులాలు ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబుకు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.