ఏపీకి "పెథాయ్" తుపాన్ ఎఫెక్ట్.. కోస్తాంధ్రలో అలర్ట్
విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీంతో కోస్తా ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం తుపాన్ గా మారే ఛాన్సుంది. దీనికి పెథాయ్ గా నామకరణం చేశారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు భారీ వర్షాలు పడే అవకాశముంది. 17వ తేదీన మధ్య కోస్తా వద్ద తీరం దాటనుంది. తుపాన్ ప్రభావాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.
కెసిఆర్ విర్రవీగుతున్నారు : బ్లాక్ మెయిలింగ్..కుమ్మక్కు రాజకీయాలు: చంద్రబాబు ఫైర్..
Recommended Video
వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. గురువారం రాత్రికి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1250 కిలోమీటర్లు.. శ్రీహరికోట నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. శుక్రవారం నాటికి తుపాన్ గా బలపడనున్నట్లు తెలుస్తోంది.
తుపానుగా మారిన తర్వాత వాయవ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం ప్రకటన విడుదల చేసింది. అయితే శనివారం నాటికి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనున్నట్లు తెలిపింది. తుపాన్ ఎఫెక్ట్ తో శుక్రవారం గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని.. తీవ్ర తుపాన్ గా మారిన తర్వాత శనివారం 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరంలో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది.
మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో శని, ఆదివారాల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. తీవ్ర వాయుగుండం తుపానుగా మారనున్న నేపథ్యంలో విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు.