బీచ్లో ఐదుగురు విద్యార్థులు గల్లంతు: ఏడుగురిలో ఒకరు మృతి, మరొకరు ఆస్పత్రిలో
విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనలో చనిపోయిన గుడివాడ పవన్ సూర్యకుమార్(21) మృతదేహం లభ్యమైంది. ఇక జాలర్లు రక్షించిన సూరిశెట్టి తేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన ఐదుగురి కోసం కోస్ట్ గార్డ్స్, మెరైన్ సిబ్బంది గాలిస్తున్నారు.
గల్లంతైన విద్యార్థులను గోపాలపట్నానికి చెందిన జగదీశ్, నర్సీపట్నం వాసి జశ్వంత్, మునగపాకకు చెందిన గణేశ్, ఎలమంచిలికి చెందిన రామచందు, గుంటూరు విద్యార్థి సతీశ్గా గుర్తించారు. రాత్రి కావడంతో గాలింపు కష్టసాధ్యంగా మారింది. కాగా, డైట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొత్తం 15 మంది విద్యార్థులు పూడిమడక బీచ్కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది.
మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ఆరా
అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో జరిగిన విషాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల గల్లంతుపై సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే సహాయ చర్యలు పర్యవేక్షించాలని.. మంత్రి గుడివాడ అమర్నాథ్కి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.