కేసీఆర్ నుంచి ఊహించని ఫోన్ కాల్.. దిగ్భ్రమ చెందిన సుంకిరెడ్డి
'ముంగిలి' పుస్తకాన్ని ప్రచురించిన కొద్దిరోజులకు.. ఊహించని విధంగా కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ రావడం ఆశ్చర్యానికి లోను చేసిందంటూ వన్ఇండియా.కామ్ ఇంటర్వ్యూలో సుంకిరెడ్డి ప్రస్తావించారు.
హైదరాబాద్: ప్రముఖ కవి, విమర్శకుడు, చరిత్ర పరిశోధకుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి వన్ఇండియా.కామ్కు ఇచ్చిన తన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ముంగిలి' పుస్తకాన్ని ప్రచురించిన కొద్దిరోజులకు.. ఊహించని విధంగా కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ రావడం ఆశ్చర్యానికి లోను చేసిందంటూ చెప్పుకొచ్చారు.
ఆయన మాటల్లో..
ఆంధ్రా ప్రాంత మేదావులు, విమర్శకులు చేస్తున్న ఆరోపణలు చూసి ఇక్కడివాళ్లే తెలంగాణ భాష, సంస్కృతిని తక్కువ చేసి చూసుకునే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి సంబంధించిన వాస్తవాలను వెలికితీయాలన్న ఉద్దేశ్యంతో 2009లో 'ముంగిలి'ని తీసుకొచ్చాం. క్రీ.శ.1700 వరకు ఉన్న తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని ఇందులో ముద్రించినం.
ఊహించని ఫోన్ కాల్ :
ఆ తర్వాత.. ముంగిలి పుస్తకాన్ని ఎప్పుడు చదివిర్రో.. ఏమో తెల్వదు గానీ ఓరోజు మాత్రం కేసీఆర్ నుంచి అనుకోకుండా ఫోన్ కాల్ వచ్చింది. అప్పడు నేను బండి మీద మా సొంతూరు పగిడిమర్రికి పోతున్నా. ఫోన్ ఎత్తగానే.. 'సుంకిరెడ్డి గారు నేను కేసీఆర్ను మాట్లాడుతున్నా' అన్న గొంతు వినిపించింది.
వెంటనే బైక్ ఓ పక్కకు ఆపుకుని ఆయనతో మాట్లాడిన. ముంగిలి పుస్తకం గురించి ప్రస్తావించి కేసీఆర్ నన్ను అభినందించిన్రు. ప్రాచీన సాహిత్య చరిత్రను వెలికితీసినందుకు చాలా ఆనందంగా ఉందన్నరు. కొద్దిసేపు తెలంగాణ సాహిత్యం గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
నంబర్ ఎలా పట్టుకున్నారు..
నా నంబర్ పట్టుకోవడానికి నల్లగొండల ఉన్న టీఆర్ఎస్ వాళ్లందరినీ కేసీఆర్ కదిలించిండని ఆ తర్వాత తెలిసింది. వాళ్ల ద్వారానే నా నంబర్ సంపాదించినట్టు తెలిసింది. మొత్తానికి ఆయన్నుంచి ఫోన్ రావడమైతే.. అసలూహించలేదు.
ఓ సభలోను అదే ప్రస్తావన:
నాకు ఫోన్ చేసినంక కొద్ది రోజుల తర్వాత.. ఓ పత్రికావిష్కరణ సభలోను నా గురించి కేసీఆర్ ప్రస్తావించారు. సభలో చాలాసేపు ముంగిలి గురించి వివరించే ప్రయత్నం చేశారట.
కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ చరిత్ర :
తెలంగాణకు చరిత్ర లేదనడం పరిశీలన చేయకుండా చేసిన వాదన. తెలుగువాళ్లంతా మూడువేల ఏళ్ల నుంచి కలిసి ఉన్నామన్న వక్రీకరణకు నా పరిశోధన ద్వారా సమాధానం చెప్పిన. తెలంగాణ స్వతంత్ర అస్తిత్వాన్ని 'తెలంగాణ చరిత్ర' ద్వారా బలంగా వినిపించగలిగిన. ఈ దెబ్బకు తెలంగాణ చరిత్ర గురించి అవాస్తవాలు మాట్లాడినవాళ్ల నోళ్లు మూతపడ్డయ్.
2011,అక్టోబర్29 నాడు కేసీఆర్ చేతుల మీదుగా సుందరయ్య విజ్ఞాన భవన్లో తెలంగాణ చరిత్ర పుస్తకావిష్కరణ జరిగింది.
*2015లో మా బిడ్డ పెళ్లి చేసినప్పుడు.. కేసీఆర్కు పెళ్లి కార్డు ఇయ్యనీకి పోయినం.. నేను, కాసుల ప్రతాపరెడ్డి, నందిని సిధారెడ్డి వెళ్లాం. మేమెళ్లేసరికి దేశపతి అక్కడే ఉన్నాడు. ఆ సందర్బంలో.. 'పలానా రోజు మీకు ఫోన్ చేసిన సుంకిరెడ్డి గారు..' అంటూ చాన్నాళ్ల కిందటి విషయాన్ని కేసీఆర్ మళ్లీ ప్రస్తావించడం గుర్తు. ఏది అంత సులభంగా మరిచిపోరాయన.
note : (సునారె పూర్తి ఇంటర్వ్యూ త్వరలో వన్ఇండియా.కామ్లో)