KKR vs RR: మలుపు తిప్పిన వరుణ్-గెలిపించిన రింకూ..! కోల్ కతా బోణీ..!
వరుణ్ చక్రవర్తి ఫామ్ లోకి వచ్చిన వేళ రాజస్థాన్ రాయల్స్ (RR)ను 156 పరుగులకే కట్టడి చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు.. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ సాయంతో ఐపీఎల్ (IPL 2026)లో ఎట్టకేలకు బోణీ చేసింది. టోర్నీలో ఇప్పటికే ఆరు మ్యాచ్ లు ఆడి వరుస ఓటములు పాలైన కోల్ కతా.. ఇవాళ ఏడో మ్యాచ్ లో మాత్రం గెలిచి బోణీ చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో స్పిన్నర్లతో పాటు రింకూ సింగ్ కోల్ కతా విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టును పేసర్ కార్తీక్ త్యాగీతో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కట్టడి చేశారు. త్యాగీ, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు, సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ 46, యశస్వీ జైశ్వాల్ 39 టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అనంతరం 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆరంభంలోనే షాకులు తప్పలేదు. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, ఆజింక్య రహానే డకౌట్లుగా వెనుదిరిగారు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ 27, రఘువంశీ 10, రోవ్ మన్ పావెల్ 23 పరుగులు, రమణ్ దీప్ 10 పరుగులు మాత్రమే చేసి వెనుదిరగడంతో కోల్ కతా ఓ దశలో 85 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో కోల్ కతా గెలుపు అసాధ్యంగా కనిపించింది. అయితే ఈ దశలో రింకూ సింగ్, అనుకుల్ రాయ్ తో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ జోడీ కోల్ కతాను విజయం దిశగా నడిపించింది. ఈ క్రమంలో రింకూ 53 పరుగులతో, అనుకుల్ రాయ్ 29 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. దీంతో కోల్ కతా మరో 2 బంతులు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.














Click it and Unblock the Notifications