జగన్ ఎంబియేపై అనుమానాలు?: దిన పత్రిక కథనం
అంత జీతం ఎందుకు ఇవ్వాలంటే? అంటూ జగన్ గుణగణాల గురించి ఆయన లేఖలో వివరించారు. జగన్ మోహన్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడైన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అని చెప్పారట. అదే జగన్ 2009 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో జగన్ తాను బి.కామ్ చదివినట్లు చెప్పుకొన్నారు. ఈ ఏడాదిలోనే జరిగిన కడప ఉప ఎన్నికల సమయంలోనూ తన అత్యున్నత విద్యార్హత గా బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అని మాత్రమే చెప్పారు. నిజంగా ఎంబీఏ చదివి ఉంటే ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు దాచాల్సి వచ్చిందని ప్రశ్నించింది. జగన్ సామర్థ్యాల విషయానికి వస్తే ఈ జాబితాలో మొట్టమొదట జగన్కు ఆర్థిక, సాధారణ పరిపాలన రంగంలో విశేష అనుభవం ఉంది అని లేఖలో పేర్కొన్నారట. పరిపాలన సంగతి పక్కన పెడితే ఆర్థిక రంగంలో ఆయన నైపుణ్యం అపారమని ఇప్పటికే తేలిపోయిందని, నడవలేని స్థితిలో ఉన్న సండూర్ పవర్ను తన తండ్రి పవర్లోకి రాగానే కోట్ల లాభాల్లోకి తేవడం, ఆ కంపెనీల్లోకి ఎన్నెన్నో కోట్ల పెట్టుబడులు ప్రవహింప చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది.
సండూర్ కంపెనీ రూపొందించిన జగన్ సామర్థ్యాల జాబితాలో ప్రాజెక్టులకు రుణాలు సంపాదించడంలో, నిధులను, వనరులను అతితక్కువ వడ్డీకి సేకరించడంలో జగన్కు ప్రత్యేక పరిజ్ఞానం ఉందని పేర్కొందట. జగన్కు ప్రభుత్వ సంస్థలతో మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రాజెక్టులకు అవసరమైన చట్టబద్ధ అనుమతులు, లైసెన్సులు సంపాదించగలరని అందులో వివరించారట. అంటే పరోక్షంగా సిఎం కుమారుడిగా ఉన్నందువల్లే ప్రభుత్వం సంస్థలతో మంచి సంబంధాలు అనే పాయింట్ వచ్చిందని కథనంలో పేర్కొంది. తన సొంత కంపెనీలకు అనుమతులు, లైసెన్సులు సంపాదించి పెట్టేందుకు, తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చేందుకు ముఖ్యమంత్రి కుమారుడిగా జగన్ తన హోదాను ఉపయోగించే వారని సండూర్ పవర్ కంపెనీ చెప్పకనే చెప్పిందన్నారు. మౌలిక సదుపాయాలు, గనులు, విద్యుత్ రంగంలో ప్రవేశించి అనేక విజయాలు సాధించినట్లు కూడా సండూర్ తన లేఖలో పేర్కొంది.