బొమ్మ కోసం చిరు, కిరణ్ ఫైట్
గత ఎన్నికల్లో ఆరోగ్యశ్రీ, 108 సేవలు కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో 108 సేవలను చిరంజీవికి ఇచ్చే విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఓ షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. 108 సేవల వాహనాలపై ఎవరి చిత్రం ఉండాలనే అంశంపైనే చిరంజీవికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెసు నుంచి ముందుకు రావాలని, ఎన్నికల విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని చిరంజీవి కోరుకుంటున్నారు. అందుకే 108 సేవల వాహనంపై తన చిత్రాన్ని ముద్రించుకోవడం ద్వారా విశేష ప్రచారం లభిస్తుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సేవలను తాను సొంతం చేసుకోవడానికి చిరంజీవి ప్రయత్నించడంలో ప్రధాన లక్ష్యం అదేనని చెబుతున్నారు. అయితే, తన ఫొటో ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారట. ఈ విషయంలోనే ఇరువురి మధ్య సయోధ్య కుదరడం లేదని సమాచారం.