తెలంగాణపై మమత దెబ్బ: చిరంజీవికి అవకాశం
కెసిఆర్ కూడా తన టిఆర్ఎస్ విలీనానికి సిద్ధపడ్డారన్న వాదనల నేపథ్యంలో కేంద్రం త్వరలో తెలంగాణపై ఓ నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ భావించారు. అయితే కేంద్రం ముందడుగు వేయాలని భావించిన మరుసటి రోజే మమత యూపిఏకు మద్దతు ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం యూపిఏ మైనార్టీలో పడిపోయింది. బయటి నుండి మద్దతిస్తున్న వారు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వారిని నమ్మే పరిస్థితి లేదు.
ప్రభుత్వాన్ని ఎలా రక్షించాలా అని ఇప్పుడు తర్జన భర్జన పడుతున్న కాంగ్రెసు పెద్దలు తెలంగాణ అంశం కోసం మరికొంత సమయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించే తీరిక, ఓపిక యుపిఏకి లేకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వాదన కూడా వినిపిస్తుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసకు వస్తే లాభం ఉంటుందని అంటున్నారు.
అయితే ఆర్థిక సంస్కరణల కోసం 19 మంది ఉన్న టిఎంసిని వదులుకున్న కాంగ్రెస్ సొంత పార్టీ ఎంపీల బెదిరింపులను లెక్క చేయకపోవచ్చుననే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముంది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికవడం, వీరభద్ర సింగ్ వంటి ఎంపీలు అవినీతి ఆరోపణలతో కేబినెట్ నుండి వెళ్లిపోవడం, టిఎంసి మంత్రుల రాజీనామా నేపథ్యంలో మన్మోహన్ కేబినెట్లో ఖాళీలు ఏర్పడ్డాయి.
వీటిని ఫుల్ ఫిల్ చేసేందుకు సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ జరగవచ్చునని అంటున్నారు. అయితే అప్పుడు మన రాష్ట్రానికి ప్రాధాన్యత లభిస్తుందని అంటున్నారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న చిరంజీవిని ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. అయితే ఆ విస్తరణ కూడా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని భావించినప్పుడు జరుగుతుంది. మరోవైపు టిఎంసిని కాంగ్రెసు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది.