నో అట్రాక్షన్: హీరోయిన్స్ పొలిటికల్ షో పల్టీ(పిక్చర్స్)
సినిమాలలో అంతెత్తుకు ఎదిగిన మన కథానాయికలు రాజకీయాల్లో మాత్రం అంత ప్రాధాన్యతను చాటుకోలేక పోతున్నారు. టాలీవుడ్లో స్టార్లుగా ఎదిగిన హీరోయిన్స్ పరిస్థితి రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం బయటకు రాలేక, అక్కడ ఉండలేక అన్నట్లుగా తయారయింది. దాదాపు అందరూ హీరోయిన్ల పరిస్థితి అలాగే ఉంది. రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసేందుకు మాత్రమే వారి ఇమేజ్ పనికి వస్తోంది. ఆ తర్వాత ఆ ఇమేజ్కి క్రమంగా ప్రాధాన్యత తగ్గుతోంది.
సినిమా రంగమే కాదు.. రాజకీయ రంగం కూడా అంత అందమైనదేమీ కాదని నాయికలకు తెలిసొస్తోంది. సినిమాలతో సంపాదించుకున్న గ్లామర్తో రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చిన అనేకమంది తారల తీరుతెన్నులు పరిశీలిస్తే సినీరంగమే నయమని ఆయా తారలు భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగినా రాజకీయాల్లో కాలుమోపిన తరువాత కొంతకాలం హల్చల్ చేసి ఆ తరువాత మరుగున పడుతున్న ఎందరో తారలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు.
90వ దశకంలో నాటి టాప్స్టార్లు వాణిశ్రీ, శారద రాజకీయ రంగప్రవేశం చేసినా ఆ తర్వాత తెరమరుగయ్యారు. ఆ తర్వాత జయప్రద, జయసుధ, రోజా, కవిత, జీవిత, విజయశాంతి వరుసగా రాజకీయ తెరంగేట్రం చేశారు. వీరిలో విజయశాంతి కొంతకాలం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అక్కడ ఇమడలేక తల్లి తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
తెలంగాణవాదం కారణంగా ఆమె హడావుడి అప్పడప్పుడు కనిపిస్తుంటుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన జయప్రద ఇక్కడి నుంచి ఉత్తర ప్రదేశ్కు వెళ్లారు. అక్కడ పరిస్థితులు సానుకూలంగా లేక తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఏ పార్టీలో చేరాలో తెలియక సతమతమవుతున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్భలంతో రాజకీయాల్లోకి వచ్చారు.
2009లో తొలిసారే ఎమ్మెల్యే అయినా.. ఇప్పుడు ఆమె రాజకీయాలపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలంటేనే వెగటు అని ఆమె చెప్పకనే చెబుతున్నారు. ఎమ్మెల్యే కావడం మినహా రాజకీయాల్లో ఆమెకు మరే ఇతర ఉన్నత స్థానం లభించలేదు. టిడిపి నుండి కాంగ్రెసులోకి వచ్చిన రోజా ప్రెస్ మీట్లతో అప్పుడప్పుడు హల్ చల్ చేస్తుంటారు. టిడిపిలోను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోను ఆమె అసంతృప్తికి లోనైన సందర్భాలు ఉన్నాయి.
ఎంత స్టార్ అట్రాక్షన్ ఉన్నప్పటికీ ఆమె గత రెండు ఎన్నికల్లో గెలువలేకపోయారు. నటి, దర్శకురాలు జీవిత కూడా రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతున్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మళ్లీ కాంగ్రెసులోకి వచ్చినా ఫలితం లేదు. నటి కవిత టిడిపిలో మొదటి నుండి కొనసాగుతున్నారు. కవిత తెలుగుదేశం పార్టీలో కాస్త హడావుడి చేస్తున్నారు.
వైయస్ ప్రోద్భలంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి మొదటిసారే ఎమ్మెల్యేగా గెలుపొందిన జయసుధ ఇటీవల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎంతగా అసంతృప్తికి లోనయ్యారంటే ఆమె ఎప్పుడైనా రాజకీయాలకు గుడ్ బై చెప్పే పరిస్థితి కనిపిస్తోంది.
టిడిపి ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన జయప్రద ఆ పార్టీలో ఇమడలేక యుపి వెళ్లారు. అక్కడ ఇమడలేక ఇక్కడకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, ఏ పార్టీలో చేరాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు.
మొన్నటి వరకు టిడిపిలో ఉండి తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన రోజా రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి చవి చూశారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్న కవిత అప్పుడప్పుడు మెరుస్తారు.
కాంగ్రెసులో చేరి.. జగన్ పార్టీ పెట్టాక కొన్ని రోజులు అటువైపు వెళ్లి.. మళ్లీ తాను కాంగ్రెసును వీడలేదని చెప్పిన జీవిత పొలిటికల్ కెరీర్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగు వెలిగిన ఊర్వశి శారద రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయారు.
తెలంగాణవాదం నేపథ్యంలో విజయశాంతి నెట్టుకు రాగలుగుతున్నారు. అయితే, అంతకుముందు ఆమె బిజెపిలో ఇమడలేకపోయారు. తల్లి తెలంగాణ పార్టీతో విజయవంతం కాలేకపోయారు.
వాణిశ్రీ రాజకీయాల్లో ఇమడలేకపోయారు.
దక్షిణాది సినీ పరిశ్రమలో వెలుగువెలిగిన జయలలిత మాత్రం రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె ప్రధానమంత్రి పదవిపై కన్నేశారు.