జగన్ టార్గెట్: బ్లాక్ పేపర్, వైయస్పైనే టిడిపి నిందలు
‘విద్యుత్ సంక్షోభం - నిరసన పత్రం' పేరుతో తెలుగుదేశం పార్టీ శానససభ్యులు సోమవారం టిడిఎల్పి కార్యాలయంలో బ్లాక్పేపర్ విడుదల చేశారు. టిడిపి ఎమ్మెల్యేలు గాలి ముద్దు కృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్, లింగారెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, దూళిపాళ్ళ నరేంద్ర తదితరులు ఈ నిరసన పత్రాన్ని విడుదల చేశారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు విద్యుత్ సంస్కరణల ద్వారా విద్యుత్ రంగంలో ఎంతో అభివృద్ధి సాధించారని, అలాంటిది కాంగ్రెస్ పాలన విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి అనుచరులు, బంధుమిత్రులకు కాంట్రాక్టులు ఇచ్చి నాసిరకం పరికరాలు, పనుల ద్వారా ఎపి జెన్కోను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. విటిపిఎస్, వరంగల్ జిల్లా భూపాలపల్లి కాకతీయ థర్మల్ ప్లాంట్ మరమ్మత్తు పనులు ఇతర విద్యుత్ కేంద్రాల నిర్మాణ కాంట్రాక్టులు కెవిపి బంధువు, వైయస్ అల్లుడికి వాటాలు ఉన్న బిజిఆర్ సంస్థకి కట్టబెట్టారని ఆరోపించారు. దీనిలో 1,950 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందన్నారు.
తమ పార్టీ స్ఫూర్తితోనే గుజరాత్ 2006లో సంస్కరణలు చేపట్టి దేశంలోనే ఇప్పుడు మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి 40 శాతం వాటా అందించడం వల్లనే గుజరాత్లో ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, ఆ తరువాత వచ్చిన రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మొద్దు నిద్రలో ఉండి జెన్కో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడమే ఈనాటి చీకటి రాజ్యానికి కారణమని మండిపడ్డారు.