'ఆ తర్వాత టి ప్రజలే బాధపడతారు, బాబుకే లాభం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగినందుకు పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలే బాధపడతారని ఏఐసిసి ముఖ్య నాయకులు ఒకరు వ్యాఖ్యానించారట. విభజన జరిగితే టి ప్రజలే బాధపడతారని ఓ ఎంపి గతంలో వ్యాఖ్యానించారు. వాటిని ఏఐసిసి నాయకులు పునరుద్ఘాటించారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆ నేత పై వ్యాఖ్యలు చేశారు. విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఎందుకు విడిపోయామా? అని తెలంగాణ ప్రజలు బాధపడతారన్నారు.
వ్యక్తిగతంగా తాను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమని, అయినప్పటికీ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. డిసెంబర్ 9 ప్రకటన పార్టీకి లాభం చేసేది కాదని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లటం మినహా తాము చేయగలిగిందేమీ లేదని చెప్పారు. అయితే, విభజన జరిగాక పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలు తప్పకుండా బాధపడతారని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందేందుకు సీమాంధ్ర ప్రాంతానికి అవకాశాలున్నాయని, విడిపోయిన పదేళ్లకు సీమాంధ్ర ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి అటు సీమాంధ్రలోను, ఇటు తెలంగాణలోను నాయకులే కరువయ్యారని, ప్రస్తుతం పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ నాయకుడూ క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలిసి పార్టీ బలోపేతం గురించి పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లేఖలు ఇవ్వటం వల్లనే తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని సీమాంధ్ర ప్రాంత నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్నారు.
సీమాంధ్ర ప్రాంత నాయకుల్లో ఎవ్వరూ ప్రజల్లోకి పోవటం లేదని, పైగా తాను పర్యటనకు వస్తానని చెబుతున్నా వారు వద్దంటున్నారన్నారు. ఇటు తెలంగాణ నాయకులు కూడా అలాగే తయారయ్యారని, అంతా హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్నారే తప్ప క్షేత్రస్థాయికి వెళ్లటం లేదన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజలంతా కాంగ్రెస్కే మద్దతు పలకాలని కోరుతూ గ్రామగ్రామాన తిరగటం లేదన్నారు.
అంతా ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నారే తప్ప పార్టీని బలోపేతం చేయడంలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం పేరుతో అధిష్ఠానాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఖరి వల్ల కాంగ్రెస్ నష్టపోతుందన్నారు. కిరణ్ కొత్త పార్టీ పెడితే అది చంద్రబాబుకే లాభం అవుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెసు చీలిపోతే ఓటు చీలిపోయి టిడిపికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ఈ నెల 30వ తేదీతో పూర్తయితే పార్లమెంటులో వచ్చే రెండో వారంలో బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని చెప్పారు.