బాక్సైట్: బాబుపై పార్టీ నేతల తిరుగుబాటు (పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు రాజకీయాల్లో మంటలు పెడుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఆందోళనలు పెరుగుతున్నాయి. సొంత తెలుగుదేశం పార్టీ నాయకులే ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై తిరగబడుతున్నారు. శనివారం అఖిలక్ష బృందం ఆధ్వర్యంలో బంద్ తలపెట్టారు.
అరకు, చింతపల్లి, అనంతగిరి ప్రాంతాల్లో బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని పర్యాటక కేంద్రాలను మూసేశారు. బాక్సైట్ తవ్వకాల అనుమతి నేపథ్యంలో అధిరార టిడిపిలో చిచ్చు రగులుతోంది. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ వైఖరి వెల్లడికావడంతో ప్రతిపక్షాలు విశాఖ నగరం, ఏజెన్సీ కేంద్రమైన పాడేరులో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాయి.
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు బాక్సైట్ తవ్వకాలకు తాను పూర్తి వ్యతిరేకమంటూ ప్రకటించుకుని, ఇప్పుడు ఎపిఎండిసికి బాక్సైట్ తవ్వకాల బాధ్యతలను కట్టబెడుతూ ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీమంత్రి పి బాలరాజు విమర్శించారు.
చంద్రబాబు ఇలా చేస్తారా..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఉప్పుడు అనుమతి ఇవ్వడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మాజీ మంత్రి బాలరాజు విమర్శించారు.
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి..
బాక్సైట్ తవ్వకాలపై జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే ఉపసంహరించుకోవాలని లేదా తాను గతంలో చేసిన ప్రకటనలు తప్పని ఒప్పుకుని ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని బాలరాజు డిమాండ్ చేశారు.
జగదాంబ జంక్షన్లో రాస్తారోకో
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నరసింగరావు ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. గతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మాటమార్చారని ఆరోపించారు.
ఉధృతం చేస్తాం..
బాక్సైట్ తవ్వకాలపై తాము నిరంతరం పోరాడుతూనే ఉన్నామని, ఇప్పుడు తమ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.
వ్యతిరేకించాలని నిర్ణయం
పాడేరులోని గిరిజన భవన్లో శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలని నాయకులు తీర్మానించారు.
పార్టీలకు అతీతంగా..
పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పోరాడితేనే బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోగలమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.
టిడిపి నేతల అల్టిమేటం
బాక్సైట్ తవ్వకాల ఉత్తర్వులు రద్దు చేయకపోతే పార్టీకి రాజీనామాలు చేస్తామని ఏజెన్సీలోని టిడిపి నేతలు అల్టిమేటం ఇచ్చారు.
మాజీ మంత్రి మణికుమారి..
టిడిపికి చెందిన మాజీమంత్రి మత్స్యరాస మణికుమారి, అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, పలువురు నేతలు పాడేరులోని ఐటిడిఏ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
ఎవరినీ సంప్రదించకుండా..
స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా, ఎవరినీ సంప్రదించకుండా బాక్సైట్ తవ్వకాల ఉత్తర్వులు జారీ చేయటంపై మణికుమారి విస్మయం వ్యక్తం చేశారు.
రాజీనామా చేస్తాం..
తవ్వకాలకే ప్రభుత్వం మెగ్గుచూపితే ఏజెన్సీలోని పార్టీ నాయకులంతా రాజీనామా చేయాలని తీర్మానించుకున్నట్టు మణికుమారి స్పష్టం చేసారు.
మణికుమారి హెచ్చరిక..
బాక్సైట్ తవ్వకాలంటూ చేపడితే ఏజెన్సీలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం తథ్యమని మణికుమారి హెచ్చరించారు.