మరాఠా మందిర్లో మరో వారం రోజులు పాటు డీడీఎల్జే
షారూఖ్ఖాన్, కాజోల్ జంటగా తెరకెక్కిన బాలీవుడ్ రొమాంటిక్ లవ్స్టోరీ దిల్వాలే దుల్హనియా లేజాయింగే సినిమాని ముంబైలోని మరాఠా మందిర్లో తీసేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని మరో వారం రోజుల పాటు ప్రదర్శించాలని థియేటర్ యాజమాన్యం నిర్ణయించింది.
అభిమానుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్పందించిన యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 1995 అక్టోబర్లో విడుదలైన ఈ సినిమా, మరాఠా మందిర్ థియేటర్లో గురువారం వరకు 1009వారాలు ఆడి బాలీవుడ్ చిత్రసీమలో చరిత్ర సృష్టించింది.
వేర సినిమాల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని దిల్వాలే దుల్హనియా లేజాయింగే సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు గురువారం థియేటర్ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు భారీగా థియేటర్ వద్దకు చేరుకొని మరికొన్ని రోజులు సినిమాని ఆడించాలని కోరారు.
అంతేకాకుండా అనేక మంది ఫోన్లు చేసి సినిమాని మరికొన్ని రోజులు ఆడించాలని కోరారు. ఈ సినిమాలో తల్లిపాత్ర పోషించిన ఫిరిదా జలాల్ వంటి అగ్రశ్రేణి నటులు స్పందిస్తూ.. సినిమాను తీసివేయడం చాలా బాధగా ఉందని, భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనసు మార్చుకున్న యాజమాన్యం మరో వారంపాటు ప్రదర్శిస్తామని ప్రకటనచేసింది.
1000 వారాల ప్రదర్శన అనంతరం సినిమాను రోజూ ఉదయం 9.15గంటలకు షో వేసిన యాజమాన్యం, ప్రేక్షకుల కోరిక మేరకు శుక్రవారం నుంచి రోజూ ఉదయం 11.30గంటలకు ప్రదర్శిస్తామని తెలిపింది.