77 లక్షలు.. లడ్డూ రికార్డ్: దామోదర భార్య పద్మిని సొంతం
మెదక్: తెలంగాణలోని మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులోని వైకుంఠపురంలో స్వామివారికి నైవేద్యంగా పెట్టిన 21 కిలోల లడ్డూకు బుధవారం వేలం పాట నిర్వహించగా రూ.77,77,777 పలికింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని దీనిని సొంతం చేసుకున్నారు.
ధనుర్మాస పూజల్లో భాగంగా బుధవారం ఆలయంలో గోదారంగనాథ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి మాజీ డిప్యూటీ సీఎం సతీమణి పద్మినితో పాటు శ్రీ వైకుఠపురం వలంటీర్లు, 350 మందికి పైగా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
కల్యాణంలో గోదారంగనాథునికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామి వారికి నైవేద్యంగా పెట్టిన 21 కిలోల లడ్డూకు వేలం పాట నిర్వహించారు. పద్మిని రూ.77,77,777లకు పాడి సొంతం చేసుకున్నారు. గత ఏడాది రూ.7,77,777లకు లడ్డూ సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పద్మిని మాట్లాడుతూ... గోదారంగనాథ కల్యాణ మహోత్సవంలో ఏటా లడ్డూను దక్కించుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు. రూ.77 లక్షలకు పైగా పోవడం ద్వారా ఈ లడ్డూ ధర వేలం పాటలో నిర్వాహకుల అంచనాలను మించిపోయింది. అత్యధిక ధర పలికి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
గతేడాది వేలంలో లభించిన అత్యధిక ధర రూ.7 లక్షలు ఉండగా... ఈసారి కొంతమేర పెరగొచ్చని భావించారు. అయితే, నిర్వాహకుల అంచనాలకు అందనంతగా వేలం ప్రారంభంలోనే సంగారెడ్డికి చెందిన ఓ వైద్యుడు రూ.24 లక్షలు పాడారు. ఆ తర్వాత వేలం పాట పోటాపోటీగా సాగింది.
పోటీదారులు ఒకరికి మించి మరొకరు ధరను పెంచుకుంటూ పోయారు. చివరకు రూ.77,77,777లకు పద్మిణి వేలం పాడి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవాలయంలా వైకుంఠపురానికి పేరు రావాలన్నది తన అభిలాషగా పద్మిని వెల్లడించారు.