రాజధాని: బాబుకు శివరామకృష్ణన్ కమిటీ షాక్
హైదరాబాద్: గుంటూరు - విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేసుకోవాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక షాక్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటును శివరామకృష్ణన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించినట్లు కనిపిస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక తమ వద్ద ఉందంటూ తెలుగు టీవీ చానెళ్లు ప్రసారం చేసిన వార్తాకథనాల ప్రకారం చంద్రబాబు ఆలోచనను శివరామకృష్ణన్ కమిటీ వ్యతిరేకించింది.
బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి కమిటీ తన నివేదికను సమర్పించింది. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని తాము చెప్పబోమంటూనే అందుకు అనువైన ప్రదేశాలేమిటో కమిటీ సూచించింది. 40 పేజీల ప్రతిపాదనలు, సుదీర్ఘ అనుబంధాలు, చిత్రపటాలతో కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ నివేదికను రూపొందించారు.
వివిధ ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేయడం గురించి చర్చించడం, విశ్లేషించడం మినహా ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేస్తే దీర్ఘకాలంలో ఆర్థిక, పర్యావరణపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. మరీముఖ్యంగా... ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల అభివృద్ధిని దెబ్బతీస్తుందని తెలిపింది.
రవాణా సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని చూస్తున్నట్లు కనిపిస్తోంది గానీ ఇతరత్రా విషయాలను పట్టించుకోవడం లేదని శివరామకృష్ణన్ కమిటీ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదనే సందేహాన్ని కూడా శివరామకృష్ణన్ కమిటీ వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఒక రాజధాని వద్దని, బహుళ రాజధానులు ఉండాలని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఒకే ఒక సూపర్ సిటీని రాజధానిగా అభివృద్ధి చేయడంకన్నా వివిధ ప్రాంతాల్లో రాజధానికి సంబంధించిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. ఒక్క సూపర్ సిటీ ఏర్పాటు వల్ల రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందబోదని అభిప్రాయపడింది. ఉమ్మడి రాష్ట్రంలో శాసన, న్యాయ, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కమీషనరేట్లు, డైరెక్టరేట్లతో కూడిన పరిపాలనా యంత్రాగం మొత్తం హైదరాబాద్లోనే కేంద్రీకృతమైందని, ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులన్నీ హైదరాబాద్ చుట్టూనే వచ్చాయని, అందువల్లే విభజన సమయంలో ఈ నగరం వివాదాస్పదమైందని కమిటీ వివరించింది.
ఆందువల్ల ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే ప్రాంతంలో పెట్టాలనడంలో అర్థం లేదని, ప్రస్తుత ఏపీ దేశంలోనే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థ అగ్రగామిగా ఉందని, అధునాతన సమాచార వ్యవస్థ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో భూగోళికంగా దూరమనేది లెక్కలోకి రాదని శివరామకృష్ణన్ కమిటీ వివరించింది. కొత్త రాజధానుల గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి శివరామకృష్ణన్ కమిటీ విస్తృతంగానే చర్చించింది. మొత్తంగా అధికారం, పాలన వికేంద్రీకరణ జరగాలనే అభిప్రాయాన్ని బలంగా వినిపించింది.