జగన్ ఓ మంచి ఖైదీ!: బుక్స్ చదివేశాడు, వ్యూహాలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు తన జైలు జీవితాన్ని రాజకీయ విశ్లేషణలకు ఉపయోగించుకున్నారట. ఆయన జైలు సమయాన్ని ఏమాత్రం వృథా చేసుకోలేదట. నిత్యం రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల పైన విశ్లేషణలు చేసుకున్నారట. పత్రికలు, టీని ఛానళ్లలో వచ్చిన సర్వేల ఆధారంగా రాజకీయపరమైన లెక్కలు వేసుకున్నారట. ములాఖత్ సమయంలో తనను కలిసిన పార్టీ నేతలతో ఆయన తన వ్యూహాలను వివరించారట.
జైళ్లో ఉన్నన్ని రోజులు జగన్ రోజు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట పాటు బ్యాడ్మింటన్ ఆడేవారంట. ఖాళీగా ఉన్న సమయాల్లో వచ్చే ఎన్నికల కోసం రాజకీయ లెక్కలు వేసుకునేవారట. కాగా, జగన్ విడుదల జైలు అధికారులకు రిలీఫ్గా మారిందట. జగన్ జైళ్లో ఉన్నన్ని రోజులు జైల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. జగన్ భద్రత జైలు అధికారులకు అతి ముఖ్యమైన విషయం. దీంతో జైలు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అంతేకాకుండా జగన్ జైల్లో ఉన్నన్ని రోజులు ప్రతిపక్షాలు జైలు అధికారుల పైన మండిపడ్డాయి. ములాఖత్లు, జగన్కు ఇచ్చే సౌకర్యాల పైన ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పలుమార్లు ప్రశ్నలు, లేఖలు సంధించింది. ఇప్పుడు జగన్ విడుదల కావడంతో జైలు అధికారులకు ఆ సమస్య తప్పిందని చెప్పవచ్చు. జగన్ విషయంలో తాము నియమ నిబంధనలు పాటించామని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో జగన్ ఓ మంచి ప్రిజనర్ అని చెబుతున్నారట. జైలు నిబంధనలకు జగన్ కచ్చితంగా పాటించేవారంట.
తాను ఎందుకు అరెస్టయ్యాననే విషయాన్ని జగన్ పలువురితో ముచ్చటించే వారంట. జగన్ నిత్యం సర్వేలు తదితరాల ఆధారంగా నియోజకవర్గాలవారిగా లెక్కలు వేసుకునే వారట. జైల్లో జగన్ నిత్యం రాష్ట్రానికి సంబంధించిన నీటి పారుదల తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదివేవారట. సిడబ్ల్యూసి విభజన ప్రకటన అనంతరం నీటి పారుదల, ఆర్థిక సంబంధ పుస్తకాలను చదివారట. జైల్లో ఉన్న కాలాన్ని జగన్ రాష్ట్రంలోని పలు సమస్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారట. ఆయా అంశాలపై అసాధారణ పట్టు సాధించారట.