మంథని గణేష్ ఉత్సవాలకు వందేళ్లు: నాగపూర్ తర్వాత ఇక్కడే!
మంథని: తెలంగాణ రాష్ట్రంలోని మంథని పట్టణానికి చెప్పుకోదగిన చరిత్రే ఉంది. అటు స్వాతంత్ర్య పోరాటంలోనూ.. ఇటు తెలంగాణ సాయుధ పోరాటంలోనూ మంథనిది కీలక పాత్రే. అంతేగాక, మంథని నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని, ఆ తర్వాత ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన దివంగత నేత పీవీ నర్సింహారావుకు మంథనితో సంబంధం విడదీయలేనిది.
ఇక వినాయక చవితి విషయానికి వస్తే.. 2016 గణపతి ఉత్సవాలతో మంథనిలో ఈ వేడుకలకు వందేళ్ళు పూర్తయ్యాయి. బ్రిటిషర్ల నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేందుకు స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర తిలక్ గణపతి నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా బీజం వేశారు. ఈ వేడుకలతో దేశం మొత్తం ప్రజలు కలిసిపోయి స్వాతంత్ర్య కాంక్షను ఎలిగెత్తి చాటారు.
కాగా, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మంథనిలో కూడా తిలక్ పిలుపుతో 1916లోనే గణేష్ ఉత్సవాలను ప్రారంభమయ్యాయి. మంథని ప్రాంత స్వాతంత్య్ర సమరయోధులు సువర్ణ రఘురామయ్య, మార్పాక శేషయ్య, మంథని లింగన్న, లోకే పెద్దరామన్న, తదితరులు సర్వజన గజాణన మండలిని ఏర్పాటు చేసి వినాయక నవరాత్రోత్సవాలకు నాంది పలికారు.
గణపతి ఉత్సావాల పేరిట కొందరు స్వాతంత్య్ర సమరయోధులు ప్రజల్లో చైతన్యాన్ని నింపి, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రగిలించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి మట్టి విగ్రహాన్ని రహస్యంగా తీసుకొచ్చారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడికి వచ్చే ప్రజలకు స్వాతంత్య్ర ఉద్యమం గురించి అవగాహన కల్పించారు. నాగపూర్, మంథనిలో మినహా దేశంలో మరెక్కడ సిద్ధి, బుద్ధి(భార్యలు) విగ్రహాలతో గణేశ్ దర్శనం లభించకపోవడం విశేషం.
ఇలా 1916లో ప్రారంభమైన వినాయక ఉత్సవాలు మంథనిలో ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో ఇక్కడి ప్రజలు వినాయక నవరాత్రోత్సవాలను నిర్వహిస్తారు. నిమజ్జనం రోజున ప్రత్యేక ఆలంకరణతో మండపాలను అలంకరించి ఊరేగింపుగా తీసుకెళతారు. ఈ వేడుక కన్నులపండువగా సాగుతుంది.