గంభీర్, సెహ్వాగ్ జోడీ ఖతం: రోహిత్, ధావన్ హిట్
హైదరాబాద్: టీమిండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య తీరినట్లే కనిపిస్తోంది. గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ జంట ఓపెనింగ్ జోడీగా ఇంతకు ముందు అత్యంత ప్రతిభావంతంగా కనిపిస్తూ వచ్చింది. కొంత కాలం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా మంచి ఓపెనర్గా ముందుకు వచ్చాడు. గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ వరుస వైఫల్యాలతో వారిని తప్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ఇండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య తలెత్తింది.
మురళీ విజయ్తో ప్రయోగాలు ఎక్కువే చేశారు. కానీ అతను అనుకున్నంతగా రాణించలేకపోయాడు. శిఖర్ ధావన్కు సరైన జోడీ కనిపించకుండా పోయింది. ఈ స్థితిలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రోహిత్ శర్మను కీలకమైన సమయంలో ముందుకు తెచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్తో రోహిత్ శర్మను జత కలిపాడు. దక్షిణాఫ్రికాపై మొదటి మ్యాచులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీ హిట్టయింది. వారి సెంచరీ భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికాపై తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 300కు పైగా పరుగులు చేసింది. ఆ రకంగా దక్షిణాఫ్రికాకు భారీ స్కోరుతో సవాల్ విసిరింది.
ఆ తర్వాత వెస్టిండీస్ మీద మంగళవారం జరిగిన మ్యాచులోనూ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీ రాణించింది. రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు. శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. వెస్టిండీస్ తమకు నిర్దేశించిన లక్ష్యం భారీగా లేకపోవడంతో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ నింపాదిగా ఆడుతూ, అదను దొరికితే బంతిని బౌండరీ దాటిస్తూ వెళ్లారు. ఆ రకంగా వారు మరోసారి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఓపెనింగ్ జోడీ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్పై ఒత్తిడి తగ్గించడంలో విజయం సాధించారు.
నిజానికి, రోహిత్ శర్మ అంతకు ముందటి ట్రాక్ రికార్డు అంత బాగా లేదు. అయినా, నమ్మకం ఉంచి రోహిత్ శర్మను ఓపెనర్గా ధోనీ ముందుకు తెచ్చాడు. ధోనీ నమ్మకాన్ని రోహిత్ శర్మ నిలబెట్టాడు. ఆ తర్వాత మరో తురుపు ముక్క రవీంద్ర జడేజా. ఆల్ రౌండర్గా రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. ఇటీవలి కాలంలో బౌలరుగా ఇండియాకు కీలకమైన సమయంలో వికెట్లను కూల్చి విజయాలను అందిస్తున్నాడు. బ్యాట్తోనూ అతను రాణిస్తున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు అతను విలువైన పరుగులు అందించిన సందర్భాలున్నాయి.
బౌలింగు విభాగంలో యువకులు ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ మేటి ఆటగాడు జహీర్ ఖాన్ లేని లోటును సమర్థంగానే పూరించారని చెప్పవచ్చు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్ వంటి ఆటగాళ్లు లేని సమయంలో ఇండియా యువ కిశోరాలతో ముందుకు సాగడానికి అవసరమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ స్థితిలో గౌతం గంభీర్, సెహ్వాగ్ వంటి సీనియర్లు తిరిగి వన్డేల్లోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది.