ముక్కుతో కొట్టాడు, గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు
హైదరాబాద్: పాతబస్తీకి చెందిన ఖుర్షీద్ హుస్సేన్ ముక్కుతో కంప్యూటర్ కీ బోర్డుపై టైప్ చేస్తూ అబ్బురపరిచాడు. ప్రస్తుతం ఖుర్షీద్ హుస్సేన్ అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. 2012 ఫిబ్రవరి 2న 'ఎ' నుంచి 'జెడ్' వరకు ఉన్న అక్షరాలను చేతులతో 3.43 సెకన్లలో కంప్యూటర్ కీ బోర్డుపై టైపు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.
అనంతరం 2014 ఫిబ్రవరి 27వ తేదీన ముక్కుతో 103 అక్షరాలను 47.44 సెకన్లలో టైప్ చేసి మరోసారి గిన్నిస్ రికార్డు సాధించాడు. అయితే మరో వ్యక్తి 46.30 సెకన్లలో ఈ ఘనతను సాధించి ఖుర్షీద్ హుస్సేన్ రికార్డుని బద్దలు కొట్టాడు.
ఆ రికార్డుని దాటేందుకు ఖుర్షీద్ హుస్సేన్ సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఖుర్షీద్ హుస్సేన్ ప్రదర్శన ఇచ్చాడు. కేవలం 43.85 సెకన్లలో ముక్కుతో కంప్యూటర్ కీ బోర్డుపై టైప్ చేసి రికార్డుని బద్దలు కొట్టాడు. తాజా రికార్డుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు పంపనున్నట్లు హుస్సేన్ తెలిపాడు.
అంకెల టైపింగ్లో అష్రఫ్
నగరంలోని ఫలక్నుమా ప్రాంతానికి చెందిన అష్రఫ్ అనే యువకుడు 1 నుంచి 50 గల సంఖ్యలను కంప్యూటర్ కీ బోర్డుపై 14.88 సెకన్ల సమయంలో టైప్ చేసి సరికొత్త రికార్డుని సృష్టించాడు. 2009లో దుబాయికి చెందిన ఆల్ ముల్లా అనే వ్యక్తి 16.30 సెకన్లలో నెలకొల్పిన ఈ రికార్డును బ్రేక్ చేశాడు. తాజాగా తాను సృష్టించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు త్వరలోనే లండన్ 'గిన్నిస్' ప్రతినిధులకు అష్రఫ్ పంపనున్నాడు. అష్రఫ్ త్వరలోనే గిన్నిస్ రికార్డుని అందుకోనున్నాడు.