రాష్ట్రం అడుగుతుంది.. కేంద్రం పెండింగ్లో పెడుతుంది! విభజన సమయం నుంచీ ఇదే వరస!!
Recommended Video
అమరావతి: కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలను ఒకలా, ఆంధ్రప్రదేశ్ను మరోలా చూస్తోంది. ఇతర రాష్ట్రాలు అడిగే ప్రాజెక్టులను కేంద్రం చట్టాలతో సంబంధం లేకుండా మంజూరు చేస్తోంది. కానీ... ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం 'విభజన చట్టంలో ఉందా, లేదా?' అని తరచి తరచి చూస్తోంది.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలే అంతంత మాత్రం! ఇక... చట్టంలో లేకుండా కొత్తగా అడిగిన వాటిని కేంద్రం ఎందుకిస్తుంది? ప్రతీ విషయంలో రాష్ట్ర అడుగుతుంది.. కేంద్రం పెండింగ్లో పెడుతుంది! ఇదే వరుస!
అడిగిన వాటిలో నాలుగు మాత్రమే...
విజయవాడ ఔటర్రింగ్ రోడ్డు, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం, నందిగామ బైపాస్ రోడ్డు నిర్మాణం, గంగవరం పోర్టు దగ్గర ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు, విశాఖపట్నంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టులు, వివిధ సంస్థలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతోపాటు అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది. ఇప్పటి వరకు రాష్ట్రం అడిగిన అనేక వినతుల్లో నాలుగింటికి మాత్రమే కేంద్రం అనుమతి లభించింది. మిగతావన్నీ ఇంతేసంగతులు!
రహదారులన్నీ డీపీఆర్ స్థాయిలోనే...
రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో.. విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి పట్టణాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు 7వ దశలో ఈ ప్రాజెక్టును చేర్చమని కోరింది. అయితే ఇప్పటికీ ఇది కేంద్రం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించే దశలోనే ఉండిపోయింది. పోర్టులు, పారిశ్రామిక ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, నూతన రాజధాని ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ అందించాన్న ఉద్దేశంతో 1602 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని రాష్ట్రం కోరింది. ఇది కూడా డీపీఆర్ల తయారీ దశలోనే ఉంది.
21 ప్రాజెక్టులు పంపితే 12కే ఆమోదం...
ఇక కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘సాగర్మాల'లో ఏపీకి చెందిన 21 ప్రాజెక్టులను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా వాటిలో 12 ప్రాజెక్టులను మాత్రమే కేంద్రం తన సాగర్మాల ప్రాజెక్టులో చేర్చింది. నందిగామ, కంచికచర్లలో ఉన్న రెండు లైన్ల బైపాస్ రహదారిని నాలుగు లైన్లకు విస్తరించాలని చేసిన విజ్ఞప్తిపైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఎల్ఎన్జీ టర్మినల్ ఏర్పాటులోనూ...
విశాఖ జిల్లాలోని గంగవరం పోర్టు దగ్గర లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టర్మినల్ (ఎల్ఎన్జీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలో కూడా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ప్రభుత్వ వాటాలు కలిగిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. గంగవరంలో ఈ టర్మినల్ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు 2014లోనే కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ హక్కులను మంజూరు చేసింది. అంతే.. ఆ తర్వాత నుంచి ఈ ఎల్ఎన్జీ టర్మినల్ ఏర్పాటు విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
ఇదీ సంస్థల ఏర్పాటు తీరు...
కాకినాడలో నేషనల్ సైన్స్ సిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలను గుర్తించింది. కానీ, భూమిని కేంద్రం పరిశీలించి ఆమోదించకపోవడంతో ఈ ప్రాజెక్టు పెండింగులో ఉంది. ఫ్లోరికల్చర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఐసీఏఆర్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 11 ఎకరాలను ఇచ్చింది. 12వ ప్రణాళికలో రూ.కోటి నిధులు కూడా కేటాయించారు. కానీ ఇప్పటి వరకు ఈ సంస్థ ఏర్పాటు కాలేదు. నేషనల్ బ్రూడ్ బ్యాంక్ ఏర్పాటుకు భూమిని గుర్తించారు. ఇది కూడా స్థల పరిశీలన నివేదిక వద్దే నిలిచిపోయింది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ప్లాస్టీకల్చర్ పార్కుకు 250 ఎకరాలను కేటాయించింది. కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. కూచిపూడి నాట్యారామం అకాడమీ పరిశీలనలో ఉంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కేంద్రం కమిటీని నియమించింది.
చాలా వరకు పెండింగ్లోనే...
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ ఆండ్ రిసెర్చ్ (నైపర్) ఏర్పాటుపై చేసుకున్న విన్నపం కూడా పెండింగులోనే ఉంది. విశాఖలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 500 ఎకరాలు కేటాయించినా కేంద్రం మాత్రం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఇక రెండు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదనలను కేంద్రం బడ్జెట్లో చేర్చాల్సి ఉంది. అమరావతిలో సైన్స్ సిటీ ఏర్పాటుపై డీపీఆర్లను సవరిస్తున్నారు. ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రాంతీయ కేంద్రం, అక్వాకల్చర్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలు కూడా పరిశీలన దశలోనే ఉన్నాయి. జాతీయ మత్స్య సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది.
చంద్రబాబు విజ్ఞప్తులూ.. బుట్టదాఖలు!
రాష్ట్రానికి సంబంధించిన పలు సంస్థల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా కేంద్రాన్ని పలుమార్లు కోరినా, లేఖలు రాసినా ప్రయోజనం లేకుండాపోయింది. రాష్ట్రంలో కేంద్ర జల సంఘం ప్రాంతీయ కార్యాలయం, జాతీయ జైళ్ల అకాడమీని ఏర్పాటు చేయాలని సీఎం చేసిన విజ్ఞప్తిని కేంద్రం బుట్టదాఖలు చేసింది. ఆంధ్రా బ్యాంకు కార్పొరేట్ కార్యాలయం, ఐడీబీఐ ప్రాంతీయ కార్యాలయం, ఎల్ఐసీ జోనల్ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరగా కేంద్రం దీనిపై ఆయా సంస్థల అభిప్రాయాలు కోరింది. ఇక... కడపలో అరటి బోర్డు, తిరుపతిలో మామిడి బోర్డు వంటి వాటిలో కనీస పురోగతి కూడా లేదు.