వైయస్ జగనే చంద్రబాబు సవాల్
రెండు రోజుల పాటు తలపెట్టిన పార్టీ వర్క్ షాపులో ఇందుకు తగిన ప్రణాళికను రచిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను గుర్తించే పనిలో పడ్డారు. ఏడాదికి ముందే అభ్యర్థులను ఖరారు చేయాలని కూడా ఆయన అనుకుంటున్నారు. దానివల్ల అభ్యర్థులు తన విజయం కోసమైనా చురుగ్గా పనిచేస్తారని ఆయన అనుకుంటున్నారు. దానివల్ల తలెత్తే అసమ్మతిని సర్దిపుచ్చడానికి కూడా సమయం దొరుకుతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ, లోకసత్తా వల్ల ఓడిపోయామని అంచనా వేసుకున్న ఆయన ఇప్పుడు అదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమైనప్పటికీ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెను సవాల్ను విసురుతోంది. తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్యకర్తలు కూడా జగన్ దారి పడతారనే ప్రచారం జరుగుతోంది. దీన్ని నివారించడానికి ఆయన తగిన వ్యూహాన్ని రచిస్తున్నట్లు చెబుతున్నారు.
కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి ఎదురవుతుందేమోననే ఆందోళనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో పార్టీ నామమాత్రంగా మారిపోయిందని అంటున్నారు. తెరాస నాయకులు మాత్రమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారు. దీంతో తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నాలు సాగించాలని అనుకుంటున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలోని పార్టీ తెలంగాణ ఫోరం రణభేరీ కార్యక్రమాల ద్వారా క్యాడర్ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మొత్తంగా వైయస్ జగన్ రూపంలోనే చంద్రబాబు పెను సవాల్ను ఎదుర్కోబోతున్నారు. జగన్ పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో వైయస్ జగన్ అవినీతిని ప్రధానాస్త్రంగా ప్రజల్లోకి చంద్రబాబు ప్రయోగిస్తున్నారు. వైయస్ జగన్ విసురుతున్న సవాల్ కూడా చంద్రబాబుకు ప్రమాదకరంగానే పరిణమించింది. కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని జగన్ చేస్తున్న ఆరోపణను బలంగా తిప్పికొట్టడంలో తెలుగుదేశం నాయకులు విఫలమవుతున్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాకుడా, మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవడానికి చంద్రబాబు భయపడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని జరుగుతున్న ప్రచారం పార్టీకి పెద్ద నష్టమే చేస్తుదని చెప్పవచ్చు. మొత్తంగా చంద్రబాబుకు అసలు సవాల్ జగన్ నుంచే ఎదురవుతోంది.