జగన్ వైపుకు: బాబుకు ముందే వంశీ హింట్?

వైయస్ జగన్ అటుగా వస్తున్న సమయంలో వల్లభనేని వంశీ అక్కడ కాసేపు తచ్చాడారని, అక్కడే చాలాసేపటి నుండి తిరగాడటం చూసిన పోలీసులు కూడా తనిఖీలు చేశారని, జగన్ వచ్చే వరకు అక్కడ ఉండే ఉద్దేశ్యంతోనే వంశీ అలా చేశాడనే వాదనలు ఉన్నాయి. ఆ తర్వాత జగన్తో కలయిక తీవ్ర వివాదం రేపింది.
అయితే అనంతరం వివరణ ఇచ్చే సమయంలోనూ వంశీ తాను జగన్ వైపు వెళుతున్నాడనే హింట్ను చంద్రబాబుకు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. వివరణ ఇచ్చే సమయంలో, వంశీ తాను పార్టీ వీడనని, టిడిపిలోనే ఉంటానని, తమ కలయిక కేవలం కాకతాళీయమేనని చెప్పుకొచ్చారు. అదే సమయంలో స్వర్గీయ మాజీ మంత్రి, టిడిపి నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ఆయన టిడిపి నేతలకు భిన్నంగా వ్యాఖ్యానించారు.
పరిటాల హత్య కేసు వెనుక జగన్ హస్తం ఉందని చంద్రబాబుతో సహా టిడిపి నేతలు నిత్యం బల్లగుద్ది ఆరోపిస్తున్నారు. కానీ వంశీ మాత్రం పరిటాల రవి హత్య కేసుతో జగన్కు సంబంధం ఉందనేందుకు తన వద్ద పక్కా ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఓవైపు టిడిపి నేతలు ముక్తకంఠంతో జగన్ను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా, వంశీ మాత్రం అందుకు ఆధారాలు లేవని చెప్పడం చర్చనీయాంశమైంది.
పరిటాల రవీంధ్రకు తాను మంచి అభిమానిగా చెప్పుకునే వంశీ, ఆయన కేసులోనే జగన్ను తప్పు పట్టక పోవడం అంటే అతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు దాదాపు సిద్ధమయ్యే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కూడా జగన్తో వంశీ భేటీ అనుకోకుండా జరిగిందని చెబుతున్నారు.
అదే సమయంలో వారు వంశీతో రాజకీయాలు మాట్లాడటం లేదని చెబుతూనే ఉప ఎన్నికల తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు కాదు నలబై మంది ఎమ్మెల్యేలు జగన్ వైపు వస్తారని చెబుతుండటం విశేషం. కాగా వంశీ మాత్రం తాను టిడిపిలోనే కొనసాగుతానని, ఏ పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదని చెబుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications