కుంపటి: బిసి మంత్రులు రాజీనామా చేస్తారా?
మంత్రివర్గంలో ఉండి కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నా తాము ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని,, చేతకాకుండా, చేవలేకుండా వ్యవహరిస్తున్నారని బీసీ మంత్రులపై విమర్శలు వస్తున్నాయి. వారు అగ్రకులాలకు అమ్ముడుపోయారని, అందుకే ముఖ్యమంత్రిని ఎదిరించలేక ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారని బిసీ వర్గాల నుంచి తీవ్ర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో బిసీ మంత్రులు ఇబ్బందుల్లో పడ్డారు.
ఫీజు రీయంబర్స్మెంట్ విధానం వల్ల కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేకిగా ముద్రపడితే, రానున్న ఎన్నికల్లో తమ భవితవ్యం కూడా దెబ్బతింటుందని వారు ముందు ముఖ్యమంత్రికి చెప్పాలని అనుకుంటున్నారు. అప్పటికీ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించకపోతే మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. మూకుమ్మడి రాజీనామాల ద్వారా బీసీలపై తమ చిత్తశుద్ధిని, బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటి స్తున్నామన్న సంకేతాలను పంపించి ఆ అంశంలో తమపై వస్తున్న ఆరోపణలు, విమర్శలకు తెరదించాలని భావిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్నివ్యతిరేకించకుండా మౌనంగా ఉంటే భవిష్యత్తులో తమ రాజకీయ భవితవ్యం కూడా గల్లంతు అవుతుందని, ఇకపై బీసీ కార్డు వినియోగించే అవకాశం, అధికారం కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. ఫీజు సీలింగ్పై తమపై విమర్శలు, ఆరోపణలు ఇంకా ఎక్కువకాక ముందే తాము రాజీనామా చేస్తే తమ పలుకుబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రాజీనామాలను ఆమోదించినా, ఆమోదించకపోయినా తమకంటూ ప్రత్యేకత మిగిలిపోతుందని, లేకపోతే చరిత్రహీనులుగా, బీసీల భవిష్యత్తును నాశనం చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోగా, సమర్థించిన చేతకాని మంత్రులుగా మిగిలిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేయాలని, లేకపోతే ఆయన లొంగే అవకాశం లేదని బీసీ ప్రముఖ నాయకుడు మంత్రుల వద్ద స్పష్టం చేశారు. ఈ సమయంలో బీసీ మంత్రులంతా రాజీనామా చేస్తే ఆ ప్రభావం పార్టీ, ముఖ్యమంత్రి భవితవ్యంపై కచ్చితంగా పడే ప్రమాదం ఉన్నందున కిరణ్ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించు కుంటారని, దానివల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా పెరుగు తుందని, తాను కూడా మీకు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.