వివేకాపై జగన్ దాడి!
భారం అంతా వివేకాపై వేసి తక్కిన మంత్రులు తెలివిగా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించింది. వివేకా మాత్రం జిల్లాలో తిష్ట వేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ, ఎంపీటీసీల ఇళ్లకు వెళ్లి బేరసారాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నట్టు చెప్పింది. వివేకా స్వయంగా సుమారు 25 నుండి 30 మంది ఎంపీటీసీలను కాంగ్రెస్ శిబిరాలకు తరలించినట్లుగా సమాచారం ఉందని చెప్పింది. శాసనసభా సమావేశాలు జరుగుతున్నా ఆయన హైదరాబాద్ వెళ్లకుండా జిల్లాలోనే ఎన్నికలపై దృష్టి సారించారన్నది. అభ్యర్థి వరదరాజులు రెడ్డిని వెంట బెట్టుకొని ఎంపీటీసీల ఇళ్లకు వెళుతున్నట్టు చెప్పింది. మంగళవారం నుండి వివేకా ఎంపీటీసీల వేట ప్రారంభించారని తెలిపింది. వారితో ఏకాంతంగా సమావేశమై భేరసారాలు చేస్తున్నట్టు ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ఎంపీటీసీలతో మాత్రమే కాకుండా, టిడిపి ఎంపీటీసీలను కూడా బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకోసం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది.
ఎంపీటీసులు బొజ్జమ్మ, మురుగేష్ రెడ్డి వివేకాపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే మండలి ఎన్నికల్లో గెలవడానికి అందరికీ ఆఫర్లు ప్రకటిస్తున్నారని, వాటికి ఒప్పుకోని వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము జగన్కు మద్దతు తెలుపుతున్నందువల్ల తమను బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు జగన్కే మద్దతు తెలిపేందుకు ఇష్టపడుతున్నారని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడిలు తట్టుకోలేక పోతున్నామని వారు ఆరోపించారు.