రాజమండ్రి ఉత్తదే: అజరుద్దీన్ సీట్లో జయప్రద
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రదకు రాకపోవచ్చునని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెసు అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చునని అంటున్నారు. జయప్రద దాదాపుగా కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అజరుద్దీన్ పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో మొరాదాబాద్ నుంచి జయప్రద పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన జయప్రద కాంగ్రెసు పెద్దలను కలిసి, ఆ పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు సమాచారం. కాంగ్రెసు తిరిగి రాంపూర్ టికెట్ను జయప్రదకు నూర్ బానోను కాదని ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆమెకు మొరాదాబాద్ సీటును కేటాయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు
స్థానిక రాచ కుటుంబానికి చెందిన నూర్ బానోను ఆంధ్రప్రదేశ్కు చెందిన జయప్రద రాంపూర్లో రెండు సార్లు ఓడించారు. ఓ వారం రోజుల్లో జయప్రద సీటుపై కాంగ్రెసు అధిష్టానం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆజం ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ గత ఎన్నికల్లో జయప్రద రాంపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.