జీతం రావడం లేదని తెలుగు ఇంజినీర్ పెళ్లి వాయిదా
దుబాయి: ఓ 30ఏళ్ల భారతీయ ఉద్యోగి తనకు ఏడు నెలలుగా జీతం రావడం లేదని.. నిశ్చయించుకున్న వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్ దుబాయ్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు.
ఈ(మే) నెలలోనే ఆయనకు వివాహం నిశ్చయమైంది. కాగా, ఆర్థికసమస్యలతో ఇబ్బంది పడుతున్న ఖదీర్కు పెళ్లి చేసుకోవడం కష్టంగా మారింది. ఆదాయ వనరులకు వేరే మార్గం కనిపించకపోవడంతో గత్యంతరం లేక పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు 'గల్ఫ్ న్యూస్'తో వాపోయారు.
నెలకు 6,500ల దిర్హమ్స్(రూ.1.13,644 లక్షలు) సంపాదిస్తున్నానని, చివరిసారిగా గత అక్టోబర్లో సుమారు రూ.60 వేలు జీతంగా అందుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన చెల్లెలి పెళ్లి కూడా నిశ్చయమైందని, ముందస్తు చెల్లింపు కోసం చేసిన రూ. 6 లక్షల అప్పు తీర్చడానికే తలకు మించిన భారమైందని తెలిపాడు.
జీతం చెల్లించడం లేదంటూ ఏప్రిల్ 20న యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు గల్ఫ్ న్యూస్కు ఖదీర్ వివరించారు. చాలా మంది నుంచి అప్పులు తీసుకున్నానని తెలిపాడు. ఇప్పుడు అందరూ తమ జీతాలు కూడా రావడంలేదని చెప్తున్నారని చెప్పాడు.