షాక్: హైదరాబాద్ యువతి మెదడులో పిండస్థ కవల
లండన్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన యామిని కరణం(26) అనే యువతికి మెదడులో పిండస్థ కవల భాగం కనిపించింది. దీనిని అమెరికా వైద్యులు తొలగించారు. ఎముక, వెంట్రుకలు, పళ్లతో కూడిన దీనిని శస్త్ర చికిత్స చేసి తీశారు.
యామిని కరణం ఇండియానా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నెల నుండి ఆమెకు చదవడం, మాట్లాడటం, తినడం ఇబ్బందిగా మారింది. తలలో తీవ్రమైన నొప్పి వచ్చేది. అది శరీరం మొత్తం పాకింది. దీంతో ఆమె ఆసుపత్రిలో చెక్ చేయించుకున్నారు.
వైద్యులు ఆమె మెదడులో పీనియల్ గ్రంథిలో కణతిని గుర్తించారు. దీనిని తొలుత తిత్తిగా భావించారు. లాస్ ఏంజిల్స్లోని స్క్లల్ బేస్ ఇనిస్టిట్యూట్లోని హ్రాయర్ షాహినియన్ చేత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. హ్రాయర్ యామిని తల వెనుక భాగంలో రంధ్రం చేసి, పుర్రెలోకి ఎండోస్కోపును పంపారు.
మెదడులో సహజసిద్ధ మార్గం ద్వారా కణతి ప్రదేశానికి పంపించారు. అక్కడ ఉన్నది కణతి కాదని, ఫోయెటస్ అని గుర్తించారు. ఎముక, వెంట్రుకలు, పళ్లతో కూడిన ఒక ముక్కును చూసి హ్రాయర్ ఆశ్చర్యపోయారు. వీటిని టెరటోమాగా పేర్కొంటారని చెబుతున్నారు. టెరటోమాను హ్రాయర్ తొలగించారు. ఆమె కోలుకుంటున్నారు.