హైదరాబాద్ మెట్రోపై ఎల్ అండ్ టీ బిగ్ షాక్?: కారణాలివేనా?
హైదరాబాద్: భాగ్యనగరి మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టి సంస్థ తప్పుకోవాలని చూస్తోందా? కేవలం తన వాటాల వరకు విక్రయించి, మరో ఇతర సంస్థకు ఈ ప్రాజెక్టును అప్పగించాలని ఆలోచన చేస్తోందా? అనే చర్చ సాగుతోంది. ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ఇందుకు సంబంధించిన వార్త వచ్చింది.
దీంతో ఈ చర్చ సాగుతోంది. దీని ప్రకారం.. ప్రభుత్వ, ప్రయచివేటు భాగస్వామ్యంలో ప్రపంచంలో ఓ పెద్ద ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోందని, తెలంగాణ ప్రభుత్వంతో పేచీ లేకుండా తన వాటాల వరకు విక్రయించి, ఇతర సంస్తకు అప్పగించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోందని పేర్కొంది.
పలుమార్లు వాయిదా పడిన మెట్రో
మెట్రో ప్రారంభం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. నాగోల్ - మెట్టుగూడ, మియాపూర్ - ఎస్సార్ నగర్ మార్గంలో మెట్రో పూర్తిగా సిద్ధమైంది. అయితే, ఇప్పటికీ కీలక ప్రాంతాల్లో భూసేకరణ, మరికొన్నిచోట్ల రైట్ ఆఫ్ వే తదితర సమస్యలు ఉన్నాయని పేర్కొంది.
పాతబస్తీపై స్పష్టత లేదా?
పాతబస్తీ గుండా వెళ్లే మూడో కారిడార్ విషయంలో భూసేకరణ, రైట్ ఆఫ్ వే గురించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదని ఎల్ అండ్ టి అసంతృప్తితో ఉన్నట్లుగా రాసింది. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.14,132 కోట్లు అని, ఇప్పుడు ఆలస్యం కావడంతో మరో రూ.2,500 నుంచి రూ.3,000 కోట్లకు పెరుగుతోందని పేర్కొంది.
పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి
ఇదిలా ఉండగా, ఎల్ అండ్ టి ఇప్పటి వరకు రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లుగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మీడియా సమావేశంలో చెప్పారని పేర్కొంది. ఇందులో దాదాపు మూడింట రెండువంతులు బ్యాంకుల కన్సార్టియం నుంచి సమీకరించినట్లు చెప్పారు.
చాలా భారం
మెట్రో రూపంలో చాలా భారం నెత్తిన పెట్టుకున్నామని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారని పేర్కొంది. మూడు కారిడార్లలోను మోస్తారుగా పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన అనుమతుల్లో తలెత్తుతున్న జాప్యం ఇబ్బంది పెడుతోందని ఎల్ అండ్ టీ వర్గాలు లోలోన వాపోతున్నాయని పేర్కొంది.
రియల్ కోణమూ
ఇందులో మరో కోణం కూడా ఉందని పేర్కొంది. అదే 'రియల్' కోణం. హైదరాబాదులో రియల్ రంగం బాగా పుంజుకుంటున్నప్పటికీ.. అది వారి అంచనాలకు తగినట్లుగా లేదని ఎల్ అండ్ టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోందని పేర్కొంది. ఇలా పలు కారణాలతో మెట్రో నిర్వహణ నుంచి తప్పుకోవాలనే యోచనకు వచ్చినట్లుగా తెలుస్తోందని రాసింది.